Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొటెం స్పీకర్గా బీజేపీ సీనియర్ ఎంపీ వీరేంద్ర కుమార్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
లోక్సభ డిప్యూటీ స్పీకర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ను వరించను న్నదా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ రాజకీయవర్గాలు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత లోక్సభలో మూడో అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా వైసీపీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. సాధారణంగా సభకు స్పీకర్గా అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ఉంటే... డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడు వ్యహరిస్తాడు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. చివరిసారి మోడీ సర్కారులో కూడా ఏఐడీఎంకే పార్టీ నేత తంబిదొరై డిప్యూటీ స్పీకర్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం అధికార పార్టీ బీజేపీ తర్వాత లోక్సభలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు ఉంది. కానీ, ఆ రెండు పార్టీలు కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్లమెంట్ నుంచి ఈ మేరకు ఆయా పార్టీలకు విజ్ఞప్తి వెళితే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వద్దన్నట్టు తెలిసింది. దీంతో లోక్ సభలో మూడో అతి పెద్ద పార్టీ వైసీపీ కావడంతో ఆ పార్టీని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సంప్రదించినట్టు తెలిసింది. ఈ విషయంపై ఆ పార్టీ నేతలు జగన్కి తెలిపినట్టు సమాచారం. అయితే, ఆ పార్టీ వర్గాలు కూడా ఇటీవల అరకు నుంచి గెలుపొందిన గుండేటీ మాధవి పేరును పరిశీలిస్తున్నట్టు భోగట్టా. 17న.. 17 వ లోక్సభ ప్రారంభమవనున్న నేపథ్యంలో ఆ రోజే ముందుగా స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాతే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పార్లమెంట్ అధికారులు ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయంపై వైసీపీ తన పార్టీ పెద్దలతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఇచ్చే పదవిని తీసుకునే అంశంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలను సంప్రదిస్తే, ఇంకా దానిపై ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.
ప్రొటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్
17వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్ర కుమార్ వ్యహరించనున్నారు. ఈ మేరకు మంగళవారం లోక్సభ కార్యాలయ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. సభకు శాశ్వత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ఆయన ప్రమాణం కూడా చేయిస్తారు. ప్రస్తుత సభకు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్న వీరేంద్ర కుమార్ టికమ్ఘర్ నియోజకవర్గం నుంచి సుమారు ఏడు సార్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇంతకుముందు మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.