Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదంలో భారత్ మొట్టమొదటిసారి తన వైఖరి మార్చుకున్నది. పశ్చిమ ఆసియాలో శాంతి కోసం ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు వేర్వేరు, స్వతంత్ర దేశాలుగా గుర్తించాలంటూ దశాబ్దాలుగా అనుసరించిన విధానాన్ని భారత్ ఒక్కసారిగా మార్చుకున్నది. ఈ ఏడాది జూన్ 6న ఐక్యరాజ్యసమితి ఆర్థిక,సామాజిక మండలి(ఎకోసాక్)లో పాలస్తీనా మానవ హక్కుల సంస్థ 'షహేద్'కు పరిశీలక హౌదాను నిరాకరిస్తూ భారత్ ఓటు వేసింది.
ఇజ్రాయెల్ పట్ల అనుకూల వైఖరి తీసుకున్న అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, కెనడాలతో భారత్ గొంతు కలిపింది. పాలస్తీనాకు అనుకూలంగా చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్తాన్తోపాటు మరికొన్ని దేశాలు ఓటు వేశాయి. మొత్తమ్మీద ఐక్యరాజ్యసమితిలో షహేద్కు పరిశీలక హౌదా ఇవ్వాలన్న ప్రతిపాదన వీగిపోయింది. ఇజ్రాయెల్కు అనుకూలంగా 28 దేశాలు, పాలస్తీనాకు అనుకూలంగా 14 దేశాలు ఓటు వేశాయి. షహేద్ను ఇజ్రాయెల్ విదేశాంగశాఖ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది. ఆచరించేది ఉగ్రవాదం, ప్రస్తావించేది మానవ హక్కుల గురించి.. అంటూ షహేద్ను ఇజ్రాయెల్ ఎద్దేవా చేసింది. లెబనాన్ కేంద్రంగా పని చేసే ఉగ్ర సంస్థ హమాస్లో ఇది ఓ భాగమని ఇజ్రాయెల్ ఆరోపించింది. పాలస్తీనా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాస్ను పలు యూరోపియన్ దేశాలు ఉగ్రవాద సంస్థగానే భావిస్తున్నాయి.
గతంలో ప్రపంచశాంతి కోసం అలీన ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత ప్రధానులెవరూ..ఇజ్రాయిల్కు అనుకూలంగా వ్యవహరించలేదు. ఇజ్రాయిల్ దేశానికి వెళ్లిన తొలి ప్రధాని మోడీ కావటం విశేషం. దశాబ్దాల తరబడి పాలస్తీనా అనుకూలంగా ఉన్న భారత్ ఇప్పుడు అకస్మాత్తుగా వైఖరి మార్చుకోవడంపై ఇంటా, బయటా విమర్శల పాలవుతోంది. మోడీ సర్కార్ అనుసరిస్తున్న అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని వామపక్షాలు సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో యుద్ధ(రక్షణ) సామగ్రి కొనుగోలు విషయంలో ఎక్కువగా రష్యాపై ఆధారపడ్డ భారత్, మోడీ అధికారం చేపట్టిన తర్వాత విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అమెరికా, ఇజ్రాయెల్లాంటి దేశాల నుంచి ఆధునిక యుద్ధ సామగ్రిని కొనుగోలు చేస్తూ మారిన తన వైఖరిని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉండటం గమనార్హం.