Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరుణాచల్ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో శకలాల గుర్తింపు
- ధ్రువీకరించిన భారత వైమానిక దళం
ఈటానగర్, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 రవాణా విమానం ఆచూకీ విషాదాంతంగా ముగిసింది. వారం రోజుల క్రితం అదృశ్యమైన విమానానికి చెందిన శకలాలను అరుణాచల్ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో వాయుసేకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్లు గుర్తించాయి. దీంతో ఎనిమిది రోజులపాటు విమానం ఆచూకీ కోసం అసోం, అరుణాచల్ప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య అటవీ ప్రాంతంలో కొనసాగుతోన్న నిర్విరామ గాలింపు చర్యలు ఆగిపోయాయి. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ధ్రువీకరించింది. ' ఈనెల 3న అదృశ్యమైన వాయుసేన విమానం ఏఎన్-32 శకలాలను అరుణాల్ప్రదేశ్లోని లిపోకు 16 కిలోమీటర్ల దూరంలో ఎంఐ-17 హెలికాప్టర్లు గుర్తించాయి' అని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. అయితే విమానంలో ప్రయాణించిన వారిగురించిన సమాచారం కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఐఏఎఫ్ తెలిపింది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు షాక్కు గురయ్యాయి. ఈనెల జూన్3న అసోంలోని జోర్హాట్ ఎయిర్బేస్ నుంచి 13 మందితో కూడిన వాయుసేన రవాణా విమానం ఏఎన్-32.. అరుణాచల్ ప్రదేశ్లోని మెచుకా ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా.. కేవలం 35 నిమిషాల తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో అదృశ్యమైన విశయం తెలిసిందే.
ఎనిమిదిరోజుల పాటు నిర్విరామ గాలింపు చర్యలు
ఏఎన్-32 అదృశ్యమైన రోజు నుంచి దాదాపు ఎనిమిది రోజుల పాటు ఏఎన్-32 విమానం కోసం ఐఏఎఫ్ నిర్విరామంగా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించింది. ఇందుకు సుఖోరు ఎస్యూ-30 యుద్ధ విమానాలు, సీ-130జే రవాణా విమానాలను. ఏఎన్-32 విమానాలు, ఎంఐ-17, ఏఎల్హెచ్ హెలికాప్టర్లను సైతం రంగంలోకి దించింది. ఐఏఎఫ్కు భారత నౌకాదళంతో పాటు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) లు తమ వంతు సహాయాన్ని అందించాయి. పీ8-ఐ సెర్చ్ ఎయిర్క్రాఫ్ట్ను నావికాదళం సమకూర్చగా..శాటిలైట్లు, డ్రోన్లతో తనవంతుగా ఇస్రో గాలింపు చర్యల్లో భాగమైంది. ఆర్మీకూడా తన హెలికాప్టర్లను గాలింపుచర్యలకు వినియోగించింది. నైట్-టైం సెన్సార్లతో రాత్రి సమయంలోనూ ఏఎన్-32 కోసం నిరాటంకంగా జల్లెడపట్టారు. అలాగే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) బలగాలు, స్థానిక పోలీసులు, స్థానికులు కూడా తమ వంతు సహాయాన్ని అందించారు. అయితే అక్కడి ప్రాంతం దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలతో కూడుకొని ఉండటం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సెర్చ్ ఆపరేషన్కు అనేక ఇబ్బందులను కలుగజేశాయి. పర్వతారోహకులు, వేటగాళ్లను సైతం స్థానిక యంత్రాంగం వినియోగించింది. ఏఎన్-32 జాడ తెలిపిన వారికి రూ.5 లక్షల రివార్డును సైతం ఐఏఎఫ్ ప్రకటించింది.