Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా అరెస్టుపై 'సుప్రీం' ఆగ్రహం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్పై అనుచిత వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారనే ఆరోపణతో అరెస్టైన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను తక్షణమే బెయిలుపై విడుదల చేయాలని యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరెస్టు రాజ్యాంగ విరుద్ధమంటూ కనోజియా భార్య కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు వేసవి కాల ప్రత్యేక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా జస్టిస్ ఇందిరా బెనర్జీ, అజరు రస్తోగిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఇదేమీ హత్య కేసు కాదని ఆయనను వెంటనే విడుదల చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రశాంత్కు బెయిలు ఇవ్వడం అంటే ఆయన పోస్టులను సమర్థించినట్టు కాదని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇది బాధితుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అతడిని 11 రోజులు రిమాండ్లో ఉంచడాన్ని తప్పుబడుతూ.. 'అతడేమైనా హత్య చేశాడా..?' అంటూ అజరు రస్తోగి ప్రశ్నించారు. సాధారణంగా ఇలాంటి కేసులను తాము విచారించమని.. కానీ సోషల్ మీడియాలో పోస్టుల కారణంగా ఓ వ్యక్తిని 11 రోజులు రిమాండ్లో ఉంచడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే ప్రశాంత్ను అరెస్టు చేసింది సీఎంపై పోస్టులు చేసినందుకే కాదని.. అంతకుముందు అతడు పురాణాలు, దేవుళ్ల గురించి అభ్యంతరకర పోస్టులు చేశాడని ఈ కేసులో యూపీ సర్కారు తరఫున హాజరైన విక్రమజిత్ బెనర్జీ కోర్టుకు తెలిపారు.
నాలుగు రోజుల్లోనే ఐదుగురు అరెస్టు
ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియా అరెస్టును మరువకముందే యూపీలో గత నాలుగురోజుల్లోనే మరో నలుగురిని యూపీ సర్కారు కటకటాల్లోకి నెట్టింది. యోగీ ఆదిత్యానాథ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతోనే వీరిని అరెస్టు చేయడం గమనార్హం. ఐదుగురిలో ఇద్దరు సీఎం సొంత జిల్లా అయిన గోరఖ్పూర్ నుంచే ఉన్నారు. 'సీఎం పెండ్లిపత్రిక ఇదంటూ' ధర్మవీర్ భారతి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాలలో ఓ పోస్టును ఉంచారు. దీనిని గోలాకు చెందిన పీర్ మహ్మద్ షేర్ చేశాడు. కాగా భారతి మస్కట్లో ఉంటుండటంతో ఇక్కడే ఉన్న మహ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు 'నేషన్ లైవ్'లో యోగీపై ఓ మహిళ మాట్లాడిన దానిని నిర్ధారణ చేసుకోకుండా ప్రసారం చేసినందుకు గానూ ఆ ఛానెల్ హెడ్, ఎడిటర్లనూ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.