Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
న్యూఢిల్లీ : మానవత్వం మరిచిపోయిన మనిషి క్రూరంగా ప్రవర్తిస్తుంటే వారిని 'జంతువులు నుంచి నేర్చుకోవాలని' పెద్దలు సూచిస్తుంటారు. జంతువులకీ బావోద్వేగాలు, ప్రేమానురాగాలు, దుఖ వంటివి ఉంటాయనే దానిని నిజం చేస్తూ.. చనిపోయిన ఏనుగు పిల్లను వదలలేక తల్లి ఏనుగుతో పాటు మరికొన్ని గుమిగూడి దానికి అంత్యక్రియలు నిర్వహించిన హృదయ విదారకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఈ వీడియోను ప్రవీణ్ కస్వాన్ అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. వీడియోలో ఓ ఏనుగు.. చనిపోయిన చిన్న ఏనుగును తొండంతో తీసుకొచ్చి రోడ్డు మీదకు వచ్చింది. దాంతోపాటే వచ్చిన ఏనుగుల గుంపు ఒకటి.. రోడ్డు దాటే క్రమంలో చనిపోయిన ఏనుగును కింద పెట్టి కాసేపు దాని చుట్టూ చేరి సంతాపం ప్రకటించాయి. ఆ తర్వాత దానిని మళ్లీ అడవిలోకి తీసుకెళ్లాయి. వృద్ధ తల్లిదండ్రులను సాకలేక బిడ్డలు వృద్ధాశ్రమాల్లో పడవేస్తూ.. వారు చనిపోతే కనీసం చూడటానికీ రాని మనుషులున్న ఈ కాలంలో ఏనుగు చేసిన పనితో అలాంటి వారికి కనువిప్పు కలగాలని నెటిజన్లు అంటున్నారు.