Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 8 నెలలకు..
- సవరణ చట్టం తెచ్చినా కుదరదంటున్న న్యాయ నిపుణులు
- బిల్లుకు మోడీ క్యాబినెట్ ఆమోదంతో మరోసారి న్యాయ సందేహాలు...
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ 8 నెలల తర్వాత ప్రయివేట్ సంస్థలు ఆధార్ను అనుసంధానం చేయడానకి మరోసారి చొరవ చూపుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 26న ఇచ్చిన తీర్పులో ఆధార్ కోసం పౌరులను ప్రయివేట్ సంస్థలు ఒత్తిడి చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. పాన్ కార్డుకు ఆధార్ లింక్ను తప్పనిసరి చేయడానికి, ఆదాయం పన్ను రిటర్న్లు ఫైల్ చేయడానికి, ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలు పొందడానికి మాత్రమే ఆధార్కు అనుమతిచ్చింది. కాగా, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి, టెలికాం సేవలకు, ఇ-కామర్స్ కంపెనీలకు, మొబైల్ నెంబర్తో అనుసంధానికి ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి, సీబీఎస్ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు, ప్రభుత్వం నుంచి విద్యార్థులు సౌకర్యాలు పొందడానికి ఆధార్ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దాంతో, ఆధార్ విషయంలో ప్రయివేట్ సంస్థలు వెనక్కి తగ్గాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల నుంచి ప్రయివేట్ సంస్థలకు వెసులుబాటు కల్పించడానికి ఈ ఏడాది మార్చి 2న కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర చట్టాల సవరణ ఆర్డినెన్స్-2019ని జారీ చేసింది. అయితే, ఆర్డినెన్స్ 6 నెలలు మాత్రమే అమలులో ఉంటుందన్నది తెలిసిందే. దాంతో, కేంద్రంలో మరోసారి అధికారం చేపట్టిన మోడీ క్యాబినెట్ జూన్ 12న ఆధార్, ఇతర చట్టాల సవరణ బిల్లు-2019కి ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆధార్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా తెచ్చేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ సవరణ చట్టం వల్ల మొబైల్ ఫోన్ కనెక్షన్లు తీసుకోవడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆధార్ను తప్పనిసరి కాకుండా స్వచ్ఛందంగా సమర్పించేందుకు వినియోగదారులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు ఖాతా తెరిచేందుకు వినియోగదారుల సమ్మతితో ఆధార్ను అనుసంధానం చేయడానికి బ్యాంకులకు అనుమతి ఇస్తూ ఆర్బీఐ ఈ ఏడాది మే 29న సవరణ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో, ఆధార్ సహితంగా ఇ కెవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ద్వారా సత్వరమే బ్యాంక్ ఖాతా తెరవడానికి వీలు కలుగుతుంది. అయితే, ఈ విషయంలో న్యాయ నిపుణుల నుంచి భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు వల్ల స్వచ్ఛందంగాగానీ, తప్పనిసరిగాగానీ ప్రయివేట్ సంస్థలకు ఆధార్ను అనుసంధానం చేసుకోవడానికి వీలుండదని కొందరంటున్నారు. చట్ట సవరణ వల్ల కూడా వీలుండదని వారు చెబుతున్నారు. మరికొందరి వాదన ప్రకారం భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కల్పిస్తున్న ఆధార్ సౌకర్యాన్ని వినియోగదారుడి సమ్మతితో ప్రయివేట్ సంస్థలు వాడుకునేందుకు వీలు కలుగుతుంది. భిన్న వాదనల మధ్య ఆధార్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత రానున్న చట్టంపై మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలున్నాయి.