Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురికి మంజూరు చేసిన బాంబే హైకోర్టు
ముంబయి: మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ బాదర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బెయిల్పై విడుదలయ్యే ధన్సింగ్, లోకేశ్ శర్మ, మనోహర్ నర్వారియా, రాజేంద్ర చౌదరీలు పూచీకత్తు
కింద రూ.50,000వేలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా విచారణ సమయంలో ప్రతి రోజూ ప్రత్యేక కోర్టుకు హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేయడంగానీ, సాక్షులను కలవటం చేయకూడదని షరతులు విధించింది. కాగా, 2013లో అరెస్టయిన వీరు అప్పట్నుంచీ జైళ్లోనే ఉన్న సంగతి తెలిసిందే. 2016లో బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. 2006 సెప్టెంబరు 8న మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో మాలేగావ్లో జరిగిన బాంబు పేలుళ్లలో 37 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.
ఎన్నో మలుపులు
ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. మొదట 'మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్' (ఏటీఎస్) తొమ్మిది మంది మైనారిటీ వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించగా ఈ తొమ్మిది మందిపైనే విచారణ కొనసాగించింది. తర్వాత ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేతుల్లోకి వెళ్లింది. అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. ఈ పేలుళ్లలో మెజారిటీ వర్గానికి చెందిన వారి పాత్రనే ఉందని తేల్చింది. దాంతో మొదట ఆరోపణలు ఎదుర్కొన్న తొమ్మిది మంది నిందితులపై ఉన్న చార్జిషీట్ను తొలగించి, సింగ్, శర్మ, నవారియా, చౌదరీలపై కేసు నమోదు చేసింది. అయితే అరెస్టయిన అనంతరం ఈ నలుగురు నిందితులు తమ బెయిల్ కోసం కాకుండా మొదట ఆరోపణలు ఎదుర్కొన్న తొమ్మిది మంది విడుదల కావడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం.