Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ
- డిప్యూటీ స్పీకర్ పదవిపై వచ్చిన వార్తలు సరికాదు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు కరిగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిటిఆయోగ్
సమావేశంలో ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై మరోసారి కోరతానని, ఈ సందర్భంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి కనుక, కేంద్ర మంత్రిని కలిశానని తెలిపారు. శుక్రవారం నార్త్ బ్లాక్లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక హోదా, విభజన హామీలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి సహకరించాలని కేంద్రాన్ని కోరడమే తమ ఉద్దేశమని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పేర్కొన్న వివిధ అంశాలు హోంశాఖ పరిధిలోనే ఉంటాయని, అందువల్ల కేంద్ర హోంమంత్రిని ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన సమస్యలు పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు. ప్రధానమంత్రి మనసు కరిగేలా మోడీకి చెప్పాలని అమిత్ షాను కోరినట్టు చెప్పారు.
తాను ఢిల్లీ వచ్చినప్పుడల్లా మరిచిపోకుండా ప్రతి సందర్భంలోనూ అడుగుతానని అన్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇస్తారని వస్తున్న వార్తలు వదంతులేనని సీఎం కొట్టిపారేశారు. అలాంటి ప్రతిపాదనలు ఏమీ రాలేదని, అవన్నీ ఉహాగానాలేనని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి తాము కోరలేదని, వారు ఇస్తామని చెప్పలేదని పేర్కొన్నారు. అమిత్షాను కలిసిన వారిలో సీఎం వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ నేత మిథున్ రెడ్డి, ఎంపీలు అవినాష్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు(శనివారం) స్థానిక ఏపీ భవన్లో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. అలాగే వైసీపీ రాజ్యసభ ఎంపీలు, లోక్సభకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో జగన్మోహన్రెడ్డి చర్చిస్తారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఎలా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేయనున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తరువాత రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నేతృత్వంలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి జగన్మోహన్రెడ్డి హాజరవుతారు. ఈ సమావేశంలో దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత తదితర అంశాలపై చర్చ జరుగుతుంది. వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ రంగంలో సంస్థాగతంగా తీసుకురావల్సిన సంస్కరణలు కూడా సమావేశ అజెండాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.