Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత అంగన్వాడీ కార్మికుల చేతి ఆహారం మా పిల్లలు తినాలా?
- తమిళనాడులో అధికారులపై అగ్రవర్ణాల ఒత్తిడి.. వర్కర్ల ట్రాన్స్ఫర్
- ఆలయ వివాదమే అసలు కారణం : కార్యకర్తలు
మధురై : మనదేశం 21వ శతాబ్దంలో అడుగుపెట్టినా...దళితులపట్ల వివక్ష, అంటరానితనం ఇంకా కొనసాగుతోంది. తమిళనాడులోని మధురైలో కుల వివక్ష బుసలు కొడుతున్నది. మధురైలోని వాలయప్పటి గ్రామంలోని ఆలయంలోకి స్థానిక దళితులు ప్రవేశించడంపై అగ్రవర్ణాలు కన్నెర్రజేశాయి. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య వైరం ముదురింది. అందులో భాగంగా కొత్తగా ఎంపికైన ఇద్దరు దళిత అంగన్వాడీ కార్మికులు వండిన ఆహారం తమ పిల్లలు తినబోరని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ''దళితులైన ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు వండిన ఆహారాన్ని మా పిల్లలు తినరు. వారు వంట చేస్తే...అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను పంపం''అని ప్రకటించారు. దీంతో ఆ ఇద్దరు దళిత అంగన్వాడీ కార్మికులను అధికారులు వేరే గ్రామాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయం బహిర్గతం కావడంతో, దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై మానవహక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి,
దళితులు వద్దే వద్దు..!
స్థానిక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీం(ఐసీడీఎస్) కార్యాలయం ఎం జ్యోతి లక్ష్మి, ఎం అన్నా
లక్ష్మిలను అంగన్వాడీ వర్కర్, హెల్పర్గా మే 3న నియమించింది. కానీ, అంగన్వాడీ కార్మికులులగా దళితులను నియమించొద్దని గ్రామంలోని అగ్రవర్ణాలు ఒత్తిడి చేశాయి. వారి నియామకంపై అభ్యంతరం లేవనెత్తిన సామాజికవర్గం, తమ పిల్లలను కేంద్రానికి పంపేందుకు నిరాకరించింది. ఈ కారణంగా ఏప్రిల్ చివరి వారంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కలెక్టర్ జోక్యం చేసుకున్నా.. సద్దుమణగలేదు. అంగన్వాడీ వర్కర్లుగా ఎంపికైన తర్వాతి రోజు ఐసీడీఎస్ కార్యాలయం వెళ్లగా.. వారిని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలిపింది. వివక్షను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికారులే ఈ తీరుగా వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవటంతో, ఆ ఇద్దరు దళిత మహిళల్ని తిరిగి అదే కేంద్రంలో అంగన్వాడీలుగా అధికారులు నియమించారు.
కుల వివక్ష తగదు : బాధితులు
టీచర్ శిక్షణ ముగించుకున్న జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ.. 'నేను దళితురాలిని కాబట్టి సొంత ఊరిలోనే పని చేసుకోలేకపోతున్నాం. నన్ను మతిప్పనూర్కు ట్రాన్స్ఫర్ చేశారు. రెండు కిలోమీటర్లు నడిచి బస్ ఎక్కి మరో పది కిలోమీటర్ల ప్రయాణం చేస్తేగానీ ఆ ఊరిని చేరుకోలం. అదీగాక, నాకు వచ్చే జీతంలో ఎక్కువగా బస్సు కిరాయిలకే పోతుంద'ని వాపోయారు. 'నేను హెల్పర్గా ఎంపికైన సంతోషం ఒక్కరోజు కూడా నిలవలేదు. కుల వివక్షను ఆపండి. సొంత ఊరిలోనే పని చేయాలనుకొంటున్నాన'ని అన్నా లక్ష్మి అన్నారు.
ఆలయ వివాదమే అసలు కారణం
వాలయప్పటి గ్రామంలో సుమారుగా.. ముథరయ్యర్ వర్గానికి చెందిన 300 కుటుంబాలు, 80 దళిత కుటుంబాలున్నాయి. గ్రామంలోని ముథలమ్మన్ ఆలయంలో దళితులు గతంలో పూజలు చేసేవారు. 13 ఏండ్ల విరామం తర్వాత ఏప్రిల్ 20న జరిగిన ఆలయ వేడుకల్లో పాల్గొనేందుకు దళితులు సిద్ధమవ్వడం అగ్రవర్ణాలకు కంటగింపుగా మారాయి. పెద్ద సంఖ్యలో దళితులు ఆలయంలోకి రావడాన్ని సహించక.. ఆలయ పూజారితో వారిని అడ్డుకున్నారు. కాగా, మే 8న ఈ వివక్షను వ్యతిరేకిస్తూ.. సీపీఐ(ఎం), తమిళనాడు అన్టచబిలిటీ ఎరాడికేషన్ ఫ్రంట్ (టీఎన్యూఈఎఫ్) నేతలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని టీఎన్యూఈఎఫ్ నేత చెల్లా కన్ను తెలిపారు. అయినప్పటికీ 24 దళితుల ఇండ్లను, ఐదు ద్విచక్రవాహనాలను ముథరయ్యర్ వర్గీయులు కాల్చి బూడిద చేశారని చెప్పారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. అంగన్వాడీలపై వివక్ష ఈ వివాదం కొనసాగింపేనని వివరించారు.
గ్రామాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) నేతలు
వలయపట్టిలో దళితులు వివక్షకు గురవుతుంటే, ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం ఆ గ్రామంలో పెత్తందారీ వర్గాలకు అన్నాడీఎంకే ప్రభుత్వం కొమ్ముకాస్తోందని సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. ప్రభుత్వ బడిలో దళిత విద్యార్థులను తరగతి గది చివరి వరుసలోనే కూర్చోబెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు గట్టునుండే మూడు స్నానశాలల్లో ఒక్కదాం ట్లోకే దళితులకు ప్రవేశమని, తాగునీరు పంపిణీకి అరగంట సమయాన్ని మాత్రమే కేటాయించారని, ఆలయ వివాదానికి ముందు గంటన్న కేటాయించేవారని చెప్పారు. కాగా, ఆలయ వివాదం జరగ్గానే సీపీఐ(ఎం), టీఎన్యూఈఎఫ్ నేతలు గ్రామాన్ని సందర్శించారు.
ఈ వివక్షకు వ్యతిరేకంగా తిరుమంగళంలోని తాలూకా కార్యాలయం ముందు ఈ నెల 18న నిరసన ప్రదర్శనలు చేపడుతున్నట్టు టీఎన్యూఈఎఫ్ నేతలు నిర్ణయించారు. వివక్ష చూపినవారిపై వెంటనే చర్యలు చేపట్టాలనీ సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.