Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని మహమ్మదీ పరిధిలోని అడవుల సమీపంలో వున్న భూమి నుండి నుండి పొగలు రావడం, అసాధారణంగా వేడెక్కుతుండటంతో సమీప గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భూమి పగుళ్ల నుండి పొగ వెలుపలికి వస్తున్నదని, మరి కొన్ని ప్రాంతాలలో నేల నిప్పుల కుంపటిలా మారుతున్నదని దక్షిణఖేరీ అటవీ పరిధిలోని బేలా పహారా, ముడా గాలిబ్ గ్రామాలకు చెందిన గ్రామస్తులు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి విపత్తులను ఎప్పుడూ చూడలేదని, దీంతో తమ పంటలకు కూడా నష్టం కలిగిస్తుందని భయపడుతున్నట్టు ముడా గాలిబ్ గ్రామానికి చెందిన 72 ఏళ్ల హుకుమ్ సింగ్(72), భారులాల్(75)లు తెలిపారు. మరి కొందరు ఈ విపత్తు అగ్నిపర్వతం పేలుడుగా భావిస్తున్నారు. ఇది సహజ ఉత్పాతమని, భూమి అడుగున ఉండే పొరల్లో అగ్ని ఉద్భవిస్తుందని మహ్మది గ్రామ తహసీల్దార్ వెల్లడించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం అనేక సంవత్సరాలుగా బంజరు భూమిగా ఉందని, సమీప అడవుల నుండి చెట్ల ఆకులు, కొమ్మలు దశాబ్దాలుగా అక్కడ పేరుకుపోవడంతో భూగర్భంలో హ్యూమస్ పొర ఏర్పడుతుందని, అక్కడ అగ్ని ఉద్భవించిందని అన్నారు. ఈ భూగర్భ మంటలను ఆర్పివేశామని, అయితే భూమి పొరలలో నుండి పొగ బయటకు వస్తోందని అన్నారు.