Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అది మాత్రమే తీర్చగలదు
- నిటి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో ఏపీ సీఎం జగన్
- ఏపీ భవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్ర విభజన కారణంగా అవశేష ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని తీర్చాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హౌదాయే తారకమంత్రమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నిటి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్రెడ్డి తొలిసారిగా నిటి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందుకు స్థానిక ఏపీ భవన్లో ఆయన నేతృత్వంలో వైసీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. లోక్సభ, రాజ్యసభల్లో సమిష్టిగా వ్యవహరించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి అంశాల్లో టీమ్లుగా ఏర్పడి ఆయా మంత్రుల వద్దకు వెళ్ళాలని ఉద్భోధించారు. అదే సమయంలో ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్కు గల అర్హతలను కేంద్రానికి నొక్కి చెప్పాలన్నారు. అనంతరం రాష్ట్రభవన్ వెళ్ళి నిటి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు. విభజన సమయంలో పార్లమెంట్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని విన్నవించుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇండ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరారు. గతంలో బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తూ గత క్యాబినెట్ తీసుకున్న నిర్ణయ కాపీని ఆయనకు అందజేశామన్నారు. ప్రత్యేక హోదాను రద్దు చేయలేదని చెబుతూ... ప్లానింగ్ కమిషన్ అబిజిత్ సేన్ లేఖను సైతం ఆ క్యాబినెట్ కాపీకి జత చేశామన్నారు.
హోదాయే నష్టాన్ని తీర్చగలదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో 59 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారన్నారు. అత్యంత ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని విరవించారు. ఐటీ రంగం హైదరాబాద్కి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువ అని వివరించారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కానీ దానిని అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన నాటికి రూ.97 వేల కోట్లుగా ఉన్న తమ అప్పు నేటికి రూ.2.59 లక్షల కోట్లకు చేరిందన్నారు. అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏడాది రూ. 40 వేల కోట్ల భారం తమ రాష్ట్రంపై పడుతోందన్నారు. తమ రాష్ట్ర యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ద్వారానే తమ రాష్ట్రానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివద్ధి జరుగుతుందన్నారు. గత ఐదేండ్లలో అవినీతితో కూడిన దుష్పరిపాలన, చిత్తశుద్ధిలేని పాలన వల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే మా జీవధారగా మిగిలిందన్నారు.