Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కాషాయీకరణకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. పాఠ్యపుస్తకాల్లోని కాషాయీకరణ, జాతీయ అతివాద...అంశాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించి, కొత్త పాఠ్యపుస్తకాల్ని విడుదలచేసింది. గతంలో అధికారంలో ఉన్న వసుంధరారాజే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం గొప్పతనం, నరేంద్రమోడీ నాయకత్వం, హిందూత్వ భావజాలంపై పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు బోధించింది. నోట్లరద్దు నిర్ణయం చారిత్రకమనీ, సావర్కర్ గొప్ప యోధుడనీ రాజస్థాన్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో పాఠాలుగా రాయించారు. 2017లో వసుంధరాజే ప్రభుత్వం చేపట్టిన పాఠ్యపుస్తకాల కాషాయీకరణ దేశవ్యాప్తంగా విమర్శలపాలైంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగనే పాఠ్యపుస్తకాల కాషాయీకరణపై దృష్టిసారించింది. వివాదాస్పద అంశాల్ని తొలగించి మళ్లీ పాఠ్యపుస్తకాల్ని రాయించారు.
నోట్లరద్దు నిర్ణయం, సావర్కర్, హల్దీఘాట్ యుద్ధం, ఆర్టికల్ 370, ఉమ్మడిపౌరస్మృతి, మైనార్టీ మతస్తులు, మత మార్పిడులు, జాతీయ అతివాద ధోరణులు, గ్రూపులు...మొదలైన అంశాల్ని తొలగించారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు గతంలో నల్లధనం ఏరివేత పేరుతో 'నోట్లరద్దు' పాఠాన్ని బోధించారు. ఇదే పాఠ్యపుస్తకంలో 'ఇండియన్ ఫారెన్ పాలసీ' పాఠంలో మళ్లీ నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రస్తావించారు. ఈ రెండింటినీ కొత్తగా రాయించిన పాఠ్యపుస్తకాల్లో నుంచి తొలగించారు. 12వ తరగతి చరిత్ర పుస్తకాల్లో స్వాతంత్ర సమర యోధుడిగా, బ్రిటీష్పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా 'వినాయక్ దామోదర్ సావర్కర్' గురించి ఉన్న పాఠాల్ని కూడా తొలగించారు.