Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ స్వరాష్ట్రంలో ప్రాణాలొదిలిన పారిశుధ్య కార్మికులు
వడోదర : మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో పారిశుధ్య కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. ఎలాంటి భద్రత పరికరాలు లేకుండానే సెప్టిక్ ట్యాంకులు, సీవరేజ్ పైప్లైన్లు శుభ్రం చేస్తూ ప్రాణాలొదులుతున్నారు. తాజాగా, వడోదరలో ఓ హౌటల్ మ్యాన్హోల్ క్లీన్ చేస్తూ నలుగురు పారిశుధ్య కార్మికులు సహా ముగ్గురు హోటల్ ఉద్యోగులూ మరణించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వడోదర నగరంలో దబోరు తెహసీల్ పరిధిలోని దర్శన్ హోటల్లోని మ్యాన్హోల్ శుభ్రం చేసేందుకు ముగ్గురు సఫాయీ కార్మికులను పిలిచారు. దీన్ని శుభ్రం చేసేందుకు శనివారం రాత్రి పారిశుధ్య కార్మికులు సిద్ధమయ్యారు. ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే మొదట ఒక కార్మికుడు మ్యాన్హోల్లోకి దిగాడు. కానీ, చాలాసేపటి వరకు పైకి రాకపోవడంతో అనుమానం వచ్చి మరో కార్మికుడు లోనికి దిగాడు. ఇలా.. ముందు దిగిన కార్మికుడిని రక్షించేందుకు ఒకరివెంట మరొకరు వరుసగా ముగ్గురు పారిశుధ్య కార్మికులు సహా ముగ్గురు హోటల్ సిబ్బంది లోపలికి దిగారు. వీరందరు మ్యాన్హోల్ లోపలికి దిగాక.. లోపలి విషవాయువులను పీల్చి మరణించినట్టు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కిరణ్ జవేరీ తెలిపారు. విషయం తెలియగానే.. ఘటనాస్థలికి ఫైర్ బ్రిగేడ్, వడోదర మున్సిపల్ కార్పొరేషన్, దబోయి సివిక్ బాడీకి చెందిన బృందాలు చేరాయని అన్నారు. దాదాపు మూడు గంటలు కష్టపడి మృతదేహాలను వెలికి తీసినట్టు వివరించారు. పోస్టు మార్టం చేసిన తర్వాత మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించినట్టు తెలిపారు. కాగా, హోటల్ యజమాని పరారయ్యాడు. మోడీ స్వరాష్ట్రంలోనే పారిశుధ్య కార్మికులు మృతి చెందడంతో స్వచ్ఛ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానిపై విమర్శలు వస్తున్నాయి. కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కుంభమేళా జరిగినప్పుడూ మోడీ.. పారిశుధ్య కార్మికుల కాళ్లను కడిగి భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించిన విషయం విదితమే. వాస్తవంలో వారి జీవితాలు బాగుపడే నిర్ణయాలేవీ తీసుకోలేదనేలా.. పారిశుధ్య కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి.