Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40శాతం చెల్లింపులు పెండింగ్లోనే
- బీజేపీ పాలిత మహారాష్ట్రలో అధికం
- సమాచార హక్కు ద్వారా వెలుగులోకి..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీఐ) కింద రైతులకు బకాయిలు సకాలంలో అందడంలేదు. పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మోడీ సర్కారు అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా గతేడాది ఖరీఫ్ ముగిసి దాదాపు ఆరునెలలు అయినా అన్నదాతలకు పీఎంఎఫ్బీఐ చెల్లింపుల మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. పీఎంఎఫ్బీవై కింద దేశవ్యాప్తంగా అన్నదాతలకు గతేడాది ముగిసిన ఖరీఫ్కు సంబంధించి క్లెయిమ్ కావాల్సిన 40శాతం నిధులు అంటే మొత్తం రూ.12,867 కోట్ల చెల్లింపులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ విషయం సమాచార హక్కు(ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారాన్ని ఆర్టీఐ కింద సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్లో ఖరీఫ్ ముగిసి రైతుల పంటకోత పూర్తయింది. పీఎంఎఫ్బీవై నిబంధనల ప్రకారం.. ఖరీఫ్ ముగిసిన రెండు నెలల తర్వాత అంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రైతులకు బకాయిలు అందాల్సి ఉంది. కానీ మోడీ సర్కారు మాత్రం ఆ వైపుగా శ్రద్ధ పెట్టలేదు. లోక్సభ ఎన్నికలు వస్తే 'కోడ్' అమలులోకి వస్తుందనీ తెలిసినా అన్నదాతలకు అందాల్సిన పెండింగ్ బకాయిల అందేలా కేంద్ర సర్కారు ప్రయత్నించకపోవడంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్రప్రభుత్వాలు సర్టిఫై చేసిన రూ.5,171 కోట్ల పెండింగ్ ఇన్సురెన్స్ బకాయిలను సదరు రాష్ట్రాలలో బీమా కంపెనీలు చెల్లింపులు చేయలేదు. కాగా, ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రం మహారాష్ట్ర సర్కారు తీరు మరీ అధ్వాన్నంగా ఉన్నది. అక్కడ ఈ పథకం కింద రైతులకు రూ.3,893 కోట్ల బకాయిలు అందాల్సి ఉండగా అందులో రూ.1,416 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రం కర్నాటకలో ఈ పథకం కింద రూ.679 కోట్ల రూపాలయను రాష్ట్రప్రభుత్వం సర్టిఫై చేయగా రూ.28 కోట్లు మాత్రమే అన్నదాతలకు అందాయి. మధ్యప్రదేశ్లో రూ.656 కోట్ల మేర అన్నదాతలకు అందాల్సి ఉన్నా.. అణా పైసా కూడా చెల్లింపులు జరగకపోవడం గమనార్హం. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రం జార్ఖండ్తో పాటు తెలంగాణలో సైతం పీఎంఎఫ్బీవై కింద రైతులకు ఎలాంటి చెల్లింపులూ జరగకపోవడం గమనార్హం. ఇక ఈశాన్యరాష్ట్రాలలో రూ.1400 కోట్లకు గానూ గతేడాది కేవలం ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం అరుణాచల్ప్రదేశ్తో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం లలో అసలు ఈ పథకం కింద ఒక్క పైసా రైతులకు అందకపోవడం గమనించాల్సిన అంశం. 'ఈశాన్యరాష్ట్రాలలో కేవలం 2.5శాతం సాగుభూమి ఉన్నా..పీఎంఎఫ్బీవై, ఆర్డబ్ల్యూ బీసీఐఎస్ కింద 10శాతం బడ్జెట్ కేటాయింపు ఉంటుంది. కానీ, ఆ నిధుల ఖర్చు ఏమీ లేకపోవడంతో ఇప్పుడవి మురిగిపోయాయి' అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
కేంద్రంలో మోడీ సర్కారు విధానాలతో పీఎంఎఫ్బీవై పథకం అమలుతీరులో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. 2016 ఖరీఫ్ సీజన్లో ఈ పథకం కింద 4.02 కోట్ల మందికి పైగా రైతులు రిజస్టర్ అయ్యారు. కానీ, 2017 ఖరీఫ్ నాటికి మాత్రం ఆ సంఖ్య కేవలం 3.47 కోట్లకు అంటే దాదాపు 14శాతం తగ్గడం గమనార్హం.