Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న జూడాల ఆందోళన
కోల్కతా : తమపై బెదిరింపులకు పాల్పడిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ వైద్యులు శనివారం ఆందోళనలు కొనసాగించారు. 48 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు చేస్తామని ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల బృందం మమత ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బెంగాల్లోని జూనియర్ డాకర్లు చేపట్టిన సమ్మె శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. గురువారం ఎస్ఎస్కెఎం ఆస్పత్రిలో వైద్యులపై బెదిరింపులకు పాల్పడిన మమత ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్కు వచ్చి తాను చేసిన వ్యాఖ్యలపై తక్షణ క్షమాపణలు చెప్పాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ఫోరం అధికార ప్రతినిధి అరిందం దుత్తా 'సెక్రటేరియట్ నుంచి తమకు చర్చలకు ఆహ్వానం వచ్చింది. కానీ మేం వెళ్లట్లేదు. ఆమె మాపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే వచ్చి క్షమాపణలు చెప్పాలి' అని అన్నారు. ఎస్ఎస్కెఎంకు వెళ్లిన ఆమె ఎన్ఆర్ఎస్కు ఆస్పత్రికి రావాలని, లేకుంటే తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం ఏర్పాటు చేయదలచుకున్న సమావేశం తమ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకేనని అన్నారు.
సంక్షోభాన్ని పరిష్కరించండి : గవర్నర్ త్రిపాఠి
దీనిపై బెంగాల్ గవర్నర్ స్పందిస్తూ 'సమస్య పరిష్కారంపై చర్చించేందుకు రాజ్భవన్కు రావాలని మమతను ఆహ్వానించా, కానీ ఆమె రాలేదు. 'ఈ సంక్షోభాన్ని త్వరగా పరిష్కరించాలి' అని మమతకు గవర్నర్ సూచించారు.
నివేదిక ఇవ్వండి : కేంద్ర హోంశాఖ
జూనియర్ వైద్యుల సమ్మెపై వెంటనే అత్యవసర నివేదిక అందించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న రాజకీయ హింసపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. జూనియర్ వైద్యుల ఆందోళనకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వైద్యుల రక్షణకు సంబంధించి డాక్టర్లు, వైద్య నిపుణులు, మెడికల్ అసోసియేషన్ల నుంచి హోంశాఖకు అనేక లేఖలు వచ్చాయని పేర్కొంది. రాష్ట్రంలో నిరంతరాయంగా సాగుతున్న ఈ రాజకీయ హింస ఆందోళనకరమైన అంశమని హోంశాఖ పేర్కొంది. గత నాలుగేండ్లలో 160 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
అన్ని హామీలను నెరవేరుస్తామన్న మమత ప్రభుత్వం
గత ఐదు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనలతో బెంగాల్ ప్రభుత్వం దిగివచ్చింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని హామీ నిచ్చింది. సమ్మెను విరమించి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని కోరింది. వైద్య సేవలు సరిగా అందక రోగులు బాధపడుతున్నారన్నారని, వైద్యులకు వ్యతిరేకంగా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ నిచ్చింది. డాక్టర్లపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మమత ప్రభుత్వం తెలిపింది.