Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి సెంట్రల్ జైలులో విలాస ఏర్పాట్లు
- ఫ్రెంచ్ కిటికీలు, మెత్తటి పరుపులతో మంచాలు, జిగేల్ మనే లైట్లు..
ఎక్కడైనా దొంగతనం చేసి పట్టుబడితే..చీకటి జైలు గదిలో చిత్రహింసలు అనుభవించాల్సిందే. అదే ఆర్థిక నేరాలకు పాల్పడి బ్యాంకులను కొల్లగొట్టి విదేశాలకు ఉడాయించితే..వారికి మాత్రం విలాసవంతమైన హంగులతో జైలు బ్యారక్ సిద్ధమవుతున్నది. అది ఎవరికో కాదు..విజరుమాల్యా (9వేల కోట్లు) నీరవ్ మోడీ(13వేల కోట్లు) బ్యాంకులను ముంచి..ఎన్డీఏ సర్కారులోని పెద్దమనుషుల సాయంతో విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు. అక్కడి కోర్టులో వారికి చుక్కెదురైనా.. ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలు (ముంబయి సెంట్రల్ జైలు)లో సకల ఏర్పాట్లలో భారత జైళ్ల శాఖ నిమగం అయింది.
న్యూఢిల్లీ : అప్పు కోసం అన్నదాత బ్యాంకు మేనేజర్ గదిలోకి అడుగుపెట్టడానికీ భయపడుతుంటాడు.. ఒక్కోసారి బ్యాంకు మేనేజరే రానివ్వడు. వేలల్లో ఉండే అప్పులు కట్టలేదని రైతులపై కేసులు పెడుతుంటారు. అవి కట్టలేక రైతులు ఆత్మహత్యలూ చేసుకుంటున్న ఘటనలు కొకొల్లలు. కానీ, ఆ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల టోకరా కొట్టే 'పెద్ద'వారి జీవన శైలి ఇందుకు పూర్తిగా భిన్నం. ఆర్థిక మోసాలు చేసి విదేశాల్లో హాయిగా బతుకుతున్నారు. క్రికెట్ మ్యాచ్లను చూస్తూ... విలాసాలు, విందులతో జల్సా చేస్తుంటారు. అలాంటి వారికి అనుకోకుండా శిక్ష పడినా.. జైలు గదులు రాజభవనాలను తలపించేలా ముస్తాబవుతున్నాయి. విజరు మాల్యా, నీరవ్ మోడీల కోసం ఇలాంటి జైలు గదులనే అధికారులు సిద్ధం చేశారు. వారిద్దరికీ శిక్ష పడే అవకాశం ఉండటంతో మహారాష్ట్రలోని ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులో కళ్లు చెదిరే అలంకరణ, సౌకర్యాలతో గదులు సిద్ధమయ్యాయి. సూర్యరశ్మి, గాలులు వీచేందుకు అనువుగా సీలింగ్ను తాకే పొడవైన ఫ్రెంచ్ కిటికీలు, టాయిలెట్లు, 24 గంటల నీటి వసతి, అనేక లేయర్లు పెయింటింగ్ వేసి తళతళ మెరిసిపోయే గోడలు, ఫ్యాన్లు, కండ్లు జిగేల్ మనిపించే లైట్లు, మెత్తటి పరుపులున్న విలాసవంతమైన మంచాలు, సీసీకెమెరాల సదుపాయాలు..ఇవి ఆర్థిక నేరగాళ్లకు కల్పిస్తున్న సౌకర్యాలు. నక్షత్ర హౌటళ్లు, రిసార్ట్లనే తలదన్నేలా ఈ జైలు గదులను ఏర్పాటు చేయటం విశేషం.
నీరవ్ మోడీ బెయిల్ పిటిషన్ను యూకే కోర్టు బుధవారం కొట్టేసింది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడం ఇది నాలుగోసారి. అలాగే, విజరు మాల్యా కేసు జులైలో విచారణకు రానున్నది. మాల్యాకు, నీరవ్ మోడీకి శిక్ష పడే అవకాశమున్నది. వారిద్దరికోసం ముంబయిలో విలాసవంతమైన జైలు రారమ్మంటున్నదనేలా హంగులు కల్పించారు. పర్సు దొంగిలించాడనే కేసు దర్యాప్తులో తన జీవితాన్నే కోల్పోయాడో చిరు వ్యాపారి. మరెందరో తమపై ఉన్న కేసు ఏమిటో కూడా తెలియకుండానే జైళ్లలో మగ్గుతున్నారు. జైలు శిక్ష అనుభవించి పశ్చాత్తాపపడి విడుదలయ్యేవారి సంగతేమో గానీ, ఇంత విలాసవంతమైన జైలులో గడిపే విజరు మాల్యా, నీరవ్ మోడీల కారాగారవాసంపై చర్చ నడుస్తున్నది.