Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ హయాంలో అవినీతిపై అమిత్ షా ఆరా!
- ఏపీ సీఎం జగన్నుంచి వివరాలు అడిగిన హోంమంత్రి
- సమయం చూసి దెబ్బకొట్టేందుకు మోడీ సర్కార్ యత్నం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దష్టి సారించిందా? 2014 నుంచి 2019 వరకు ఆయన పాలనలో అంతర్గతంగా చోటుచేసుకున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాలపై అవసరమైన డేటాను సేకరించేందుకు మోడీ సర్కారు సన్నద్ధమైందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీలోని నార్త్ బ్లాక్ వర్గాలు. ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం జరిగిన నిటి ఆయోగ్ సమావేశానికి శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదే రోజు సాయంత్రం
కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షాతో సుమారు గంటకుపైగా మంతనాలు జరిపారు. అయితే, ఆయన హౌంమంత్రితో భేటీలో హౌదా, విభజన సమస్యలకు సంబంధించిన అంశాలను చర్చించానని మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, అమిత్ షాతో జగన్ ప్రధానంగా చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలను కేంద్రానికి అందజేసినట్టు సమాచారం. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టులు, ఇసుక మాఫియా, ఆదాయ పన్ను సంబంధిత విషయాల్లో టీడీపీ కీలక నేతలు, ఎంపీలపై అమిత్ షా ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరెవరికి.. ఎక్కడ లొసుగులున్నాయన్న దానిపై చర్చ నడిచినట్టు తెలిసింది. ఈ ఇద్దరి భేటీలో కూడా అమిత్ షా అడిగిన పూర్తి సమాచారాన్ని సీఎం జగన్ అంశాలవారీగా వివరించినట్టు భోగట్టా. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం నిటి ఆయోగ్ సమావేశంలో తన ఉపన్యాస సంధర్భంలో కూడా నొక్కి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విపరీతమైన అక్రమాలు, వ్యవస్థాగతమైన అవినీతి జరిగిందని వ్యాఖ్యానించారు. దాని కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి కంపెనీలు సైతం ఆసక్తి చూపలేదని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగేందుకు ఆస్కారం ఏర్పడిందని వివరించారు.
సమయం చూసి చంద్రబాబుపై ఎటాక్..
కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పాలనలో కింది స్థాయిలో జరిగిన అవినీతి, అక్రమాలను నేతల పేర్లవారీగా పెద్ద ఎత్తున సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీతో బీజేపీ సఖ్యతగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో దెబ్బతిని ఉన్నటువంటి చంద్రబాబు, తన పార్టీ క్యాడర్ను కేసుల పరంగా ఇరికించి టీడీపీ కింది స్థాయి కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొనే విధంగా చేయాలని యత్నిస్తున్నట్టు తెలిసింది. దాంతో పాటు బీజేపీయేతర పక్షాలు, ఇతర ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చంద్రబాబు ఇదివరకు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ, జాతీయవాద చర్చ కారణంగా ప్రతిపక్షాలన్నీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే, మళ్ళీ అదే విధంగా భవిష్యత్లో కూడా చంద్రబాబుకు ఉన్నటువంటి ఆర్థిక శక్తి, సంబంధాలతో విపక్షాలను ఏకం చేస్తే తమకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం లేకపోలేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు ఇటీవల ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన లొసుగులు తమ చెంత ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు బాబును ఇబ్బంది పెట్టాలని మోడీ, షాలు యోచిస్తున్నట్టు నార్త్ బ్లాక్ వర్గాల సమాచారం. అయితే, దీనికి మరికొంత సమయం పడుతుందని, ఒకదాని తర్వాత ఒకటి వెలికి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.