Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో..
- కాంగ్రెస్ పక్ష మాజీ నేత రాధాకృష్ణకు చోటు
ముంబయి : ఇటీవలి వరకూ మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేతగా ఉన్న రాధాకృష్ణ విఖే పాటిల్ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిన కొన్ని రోజుల్లోనే ఆయనకు మంత్రిపదవి వరించింది. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మొత్తం 13 మందికి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చోటుకల్పించారు. రాధాకృష్ణకు వ్యవసాయ శాఖను కేటాయించారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు మార్చిలో పాటిల్ కుమారుడు సుజరు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ తరపున అహ్మద్నగర్ స్థానంలో పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత రాధాకృష్ణ కూడా పార్టీ మారుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. అనంతరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈనెల 4న ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేశారు.మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న 13 మందిలో బీజేపీ నుంచి 10 మంది, శివసేన నుంచి ఇద్దరు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నుంచి ఒకరు గవర్నర్ విద్యాసాగర్రావు ఆధ్వర్యాన ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో క్యాబినెట్ మంత్రులుగా ఎనిమిది మంది, స్టేట్ ఆఫ్ మినిస్టర్స్గా ఐదుగురు బాధ్యతలు స్వీకరించారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీనియర్ నేత జయదుత్తా క్షీర్సాగర్, ఆర్పీఐ నుంచి అవినాష్ మహాటేకర్లకు ఈ జాబితాలో చోటుదక్కింది. రాధాకృష్ణ, జయదుత్తా, అవినాష్లకు ప్రస్తుతం అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులుగా లేరు. దీంతో వీరు ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకుంటే ముగ్గురూ మంత్రి పదవులు కోల్పోవాల్సి వస్తుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్న కేవలం ఒక్కరోజు ముందే సీఎం ఫడ్నవిస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.