Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్కుమార్
మొవ్వ (కృష్ణా): ప్రజలకు సత్వర న్యాయం అందించడమే న్యాయస్థానాల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా మొవ్వలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఏజేఎఫ్సీఎం కోర్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం క్షేత్రయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సత్వర న్యాయసేవలందించే లక్ష్యంతోనే న్యాయ స్థానాలు కృషి చేస్తున్నాయన్నారు. మొవ్వలో కోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఉన్నప్పుడే పరిశీలనలో ఉందని, అది ఇప్పటికి కార్యరూపం దాల్చటం అభినందనీయమన్నారు. కేసుల సంఖ్య పెరిగి విచారణలో జాప్యం కావడం వల్ల కక్షిదారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. లోక్అదాలత్లు వంటివి నిర్వహించి వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఎం.గంగాధరరావు మాట్లాడుతూ న్యాయ స్థానం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా మొవ్వలోనే ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు మంచి అవకాశమని, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మండలాలవారు ఈ న్యాయస్థానం అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎ.ఎం.డి.ఇంతియాజ్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, మొవ్వ జూనియర్ సివిల్ జడ్జి రమ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.