Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు బీహెచ్యూ విద్యార్థులకు తీవ్రగాయాలు
- క్యాంపస్లో ఉద్రిక్తవాతావరణం
వారణాసి : వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) పరిసరప్రాంతంలో స్థానిక బీజేపీ నాయకుడి కారు.. బైకుపై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులపై దూసుకెళ్లింది. ఆ ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. అయితే నిర్లక్ష్యంగా కారును నడిపి ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయలపాలవడానికి కారణమైన బీజేపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని వర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో వర్సిటీ క్యాంపస్లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలోని సెంట్రల్ ఆఫీసుకు రాకేష్సింగ్, అంజులతా సింగ్ బైకుపై వెళ్తున్నారు. అయితే వారికి ఎదురుగా వస్తున్న ఓ ఎస్యూవీ కారు ఆ ఇద్దరు విద్యార్థులు వెళ్తున్న బైకును బలంగా ఢకొీట్టింది. దాంతో ఆ ఇద్దరు విద్యార్థులు బైకు మీద నుంచి కొంత దూరం వరకు ఎగిరిపడి తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో ఆ ఇద్దరిని సహచర విద్యార్థులు బీహెచ్యూ ట్రామా సెంటర్కు తీసుకెళ్లారు. కాగా, ప్రమాదం అనంతరం కారులో ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఈ కారు బీజేపీ నాయకుడు రణ్వీర్సింగ్కు చెందిందని పోలీసు అధికారి భరత్ భూషన్ తెలిపారు. అనంతరం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.