Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వారాల్లో కేంద్రానికి 50వేల సూచనలు
- 22న రాష్ట్రాలతో సమావేశానికి కేంద్రం యోచన
న్యూఢిల్లీ : వివాదాస్పద నూతన విద్యావిధానం(ఎన్ఈపీ) ముసాయిదాపై కేంద్రానికి సలహాలు, సూచనలు వెల్లు వెత్తుతున్నాయి. జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులను సూచిస్తూ ఇస్రో మాజీ చైర్మెన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలోని కమిటీ ఈ ముసాయిదాను గతనెల 31న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) మంత్రిత్వశాఖకు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రజల అభిప్రాయం కోరుతూ అదేరోజు ఈ ముసాయిదాను కేంద్రం బహిరంగపర్చింది. దీంతో 'నూతన విద్యావిధానం ముసాయిదా'పై దేశవ్యాప్తంగా కేంద్రానికి సలహాలు, సూచనలు వేలల్లో వచ్చాయి. కేవలం రెండువారాల్లోనే దాదాపు 50వేల సలహాలు, సూచనలు కేంద్రానికి అందాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. తమకు అందిన సలహాలు, సూచనలపై ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తున్నదని ఓ అధికారి ఒకరు తెలిపారు. ఈనెలాఖరు వరకు ఈ సంఖ్య దాదాపు లక్ష వరకు చేరొచ్చని ఆయన అంచనా వేశారు. ముసాయిదాపై సలహాలు, సూచనలు కేంద్రానికి పంపడానికి ఈనెల 30 చివరితేదీ కానున్నది. కాగా, ఎన్ఈపీ ముసాయిదాపై ఈనెల 22న ఆయా రాష్ట్రాలతో సమావేశం కావడానికి కేంద్రం యోచిస్తున్నది. జులై చివరినాటికి సలహాల, సూచనల ప్రక్రియను ముగించి ఎన్ఈపీ ముసా యిదాను క్యాబినెట్ ముందు కేంద్రం ప్రవేశపెట్టొచ్చని అధికారి ఒకరు తెలిపారు. హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ఎన్ఈపీ ముసాయిదా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.