Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్-2 లో బ్యూరోక్రాట్లకు సర్వాధికారాలు
- కేంద్ర మంత్రివర్గాన్ని నియంత్రించటం కోసమే ఇదంతా!
- బీజేపీలోపలి వ్యక్తులపై కన్నా...బయటివారిపైనే భరోసా
- 'వైట్హౌస్' తరహా అధికారంపై ప్రధానికి మోజు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ-అమిత్ షా ద్వయం కూర్చిన కేంద్ర మంత్రివర్గంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చసాగుతోంది. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్లో తన మాటకు ఎదురులేకుండా డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే చేశారో, అలాగే ప్రధాని కార్యాలయాన్ని మార్చాలన్నదే మోడీ సర్కార్ -2 వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎలాగూ అమిత్ షాకు ఉన్నాయి. ఇక మిగిలినవి...కేంద్ర మంత్రివర్గం, ప్రధాని కార్యాలయం. ఈ రెండింటినీ నియంత్రించడానికి ప్రధాని ఎంచుకున్న వ్యూహం...ముగ్గురు మాజీ బ్యూరోక్రాట్లకు కేబినెట్ హోదా ఇవ్వటం. పాలనలో 'గుజరాత్ మోడల్' కాస్తా...ఇప్పుడు మోడీ మోడల్గా రూపాంతరం చెందిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈసారి ప్రధాని కార్యాలయంలో చోటుచేసుకున్న మార్పులు బీజేపీ నాయకులకు సైతం మింగుడుపడటం లేదు. బీజేపీ లోపలి వ్యక్తులను కాకుండా, బయటివ్యక్తులతో ప్రధాని మోడీ తన అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాక పార్టీలోని అత్యంత సీనియర్ నాయకులను పక్కకుపెట్టి, ముగ్గురు మాజీ బ్యూరోక్రాట్లకు కేబినెట్ హోదా ఇవ్వటమూ పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కేంద్ర మంత్రివర్గంలో తన మాటకు ఎదురుండకూడదన్న ఉద్దేశంతో బ్యూరోక్రాట్లకు (ఎస్.జైశకంర్, అజిత్ దోవల్, నృపేంద్ర మిశ్రా, పికె.మిశ్రా) ప్రాధాన్యత ఇచ్చారనీ, వీరితో మంత్రివర్గాన్ని సైతం నియంత్రించాలన్నదే వ్యూహమనీ విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం, పార్టీ అంతా ఇప్పుడు అమిత్ షా చేతుల్లో ఉంది. ప్రభుత్వ పాలన, మంత్రివర్గ కార్యాలయాలపై పూర్తి పట్టుకోసం బ్యూరోక్రాట్లను ప్రధాని మోడీ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై 'మోడీ నిర్ణయాలు' కేవలం క్యాబినెట్ హోదా ఉన్న నలుగురు బ్యూరోక్రాట్ల ద్వారా అమలు చేయబోతున్నారట. నోట్లరద్దు నిర్ణయాలు, ఆర్బీఐలో మార్పులు, న్యాయవ్యవస్థను నియం త్రించే ప్రయత్నాలు, సీబీఐ సంక్షోభం...మోడీ-1 ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. నియంత పోకడలు బహిర్గతమ య్యాయి. అయితే ఈ తరహా పాలనను మరింత బలోపేతం చేయడం కోసమే ప్రధాని మోడీ-అమిత్ షా ద్వయం గట్టి ఏర్పాట్లుచేసినట్టు తెలుస్తోంది.
అధికారమంతా ఆ నలుగురు చేతుల్లో..
మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్రా(ప్రస్తుతం ప్రధాని ప్రిన్స్పల్ సెక్రెటరీ), ప్రధాని అడిషినల్ ప్రిన్స్పల్ సెక్రెటరీ పి.కె.మిశ్రా(గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి)లకు కేంద్ర మంత్రి హోదా కల్పించారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్.జైశంకర్కు ఏకంగా విదేశీ వ్యవహరాల శాఖ ఇచ్చారు. అయితే ఎంపికలు సహజసిద్ధమైన రాజకీయ పరిణామాలు కావన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. దీనివెనుక ప్రధాని మోడీ-అమిత్ షాలకు చాలా పెద్ద వ్యూహమున్నదని వారు అంచనావేస్తున్నారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ను ఇక్కడ ఆదర్శంగా తీసుకున్నారని తెలుస్తోంది. కొద్దిమంది కేంద్ర మంత్రులతో 'వైట్హౌస్' కార్యకలాపాలను ట్రంప్ నిర్వహించటం మనం చూస్తేనే ఉన్నాం. ఇందులో విదేశీ వ్యవహారాలు, రక్షణశాఖ అత్యంత కీలకమైనవి. వీటిలో ఒకటి జైశంకర్కు అప్పజెప్పారు. రక్షణశాఖ అంతా అజిత్ దోవల్తో నడిపిస్తారని తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నాయకులకు, బయటివారికి, రాజకీయ, సామాజిక, సాంకేతిక రంగ నిపుణులకు ఎన్డీయే-1 పాలనలో ఏమాత్రమూ ప్రాధాన్యత దక్కలేదన్న విమర్శ ఉంది. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ మోడీ-అమిత్ షా ద్వయమే సర్వాధికారాన్ని చలాయించారు. దానిని మరింత పెద్దస్థాయిలో అమలుజేయటం కోసమే క్యాబినెట్ కూర్పు జరిగిందని బీజేపీకి చెందిన కొంతమంది నాయకులు చెబుతున్నారు.