Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడి నుంచే ఎన్హెచ్ఆర్సీకి అత్యధిక ఫిర్యాదులు
- తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్
న్యూఢిల్లీ : నకిలీ ఎన్కౌంటర్ మరణా లకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉన్నది. తర్వాతి స్థానంలో యోగి ఆదిత్యానాథ్ పాలిత ఉత్తరప్రదేశ్ నిలిచింది. 2015 జనవరి 1వ తేదీ నుంచి 2019 మార్చి 20వ తేదీ మధ్యకాలంలో బూటకపు ఎన్కౌంటర్ మరణాలకు సంబంధించి దేశవ్యా ప్తంగా మొత్తం 211 ఫిర్యాదులు అందాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని, ఈ రాష్ట్రం నుంచి 57 కేసుల ఫిర్యాదులు దాఖలై నట్టు తెలిపింది. తెలంగాణ నుంచి నాలుగు, ఛత్తీస్గఢ్ నుంచి 10, జార్ఖండ్ నుంచి 13, ఒడిషా నుంచి 22, అసోం నుంచి ఎనిమిది నకిలీ ఎన్కౌంటర్లకు సంబంధించిన ఫిర్యాదులు దాఖలయ్యాయి. కాగా, ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ 39 ఫిర్యాదులతో రెండో స్థానంలో ఉన్నంది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ కేసుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆగ్రాకు చెందిన కార్యకర్త నరేశ్ పరాస్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు
సమాధానంగా ఈ మేరకు సమాచారం వెల్లడైంది. ఉత్తరప్రదేశ్లోని 39 బూటకపు ఎన్కౌంటర్ కేసుల్లో 22 కేసులను డిస్పోజ్ చేసిందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. 17 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించింది. అధికారిక నివేదికలు సమర్పించిన తర్వాత దేశవ్యాప్తంగా 73 నకిలీ ఎన్కౌంటర్ కేసులను మూసివేసినట్టు పేర్కొంది. 99 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. ఎన్కౌంటర్కు సంబంధించిన వాస్తవికత గురించిన ప్రశ్నకు సమాధానంగా.. ఒక ఎన్కౌంటర్ నకిలీదా? వాస్తవమైనదా? అనే విషయాన్ని ధ్రువీకరించబోమని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. మానవ హక్కులు ఉల్లంఘించబడిన కేసులను విచారిస్తామని వివరించింది. 25 కేసుల్లో మానవ హక్కులు ఉల్లంఘించబడిన వ్యక్తి కుటుంబాలకు 1.7 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని పలురాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించినట్టు తెలిపింది.
నకిలీ ఎన్కౌంటర్ కేసులను నిష్పక్షపాతంగా విచారించాలనీ, ఈ ఎన్కౌంటర్లకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త నరేశ్ పరాస్ తెలిపారు. అలాగే, పరిహారం కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా.. బాధ్యులైన అధికారుల నుంచి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో నకిలీ ఎన్కౌంటర్లపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్), సిటిజెన్స్ అగెనెస్ట్ హేట్లు దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ.. ఇది తీవ్రమైన విషయంగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అధికారులూ భారత సర్కారుకు లేఖ రాశారు. 15 కేసులు చట్టవ్యతిరేక హత్యలనీ, 59 కేసులు నకిలీ ఎన్కౌంటర్లయ్యే అవకాశముందని పేర్కొంటూ ఈ ఘటనలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.