Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతు మృతి
- చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఇబ్బందులు
అనంతపురం: అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనకాయల కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఒక రైతు మృతి చెందాడు. విత్తనా ల కోసం మడకశిర మండల కేంద్రంలోని పంపిణీ కేంద్రానికి గుర్రపు కొండ గ్రామానికి చెందిన రైతు చిక్కన్న (68) సోమవారం వచ్చారు. ఉదయం నుంచి క్యూలో నిలబడిన ఆయన అధికారి వద్ద వేలిముద్ర వేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాడు. విత్తనకాయలు తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో గోదాము వద్ద కుప్పకూలిపోయాడు. కాలికి గాయమవడంతో స్థానిక పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కట్టుకట్టి చికిత్స అందిస్తున్న క్రమంలో చనిపోయాడు.
జిల్లాలో శనివారం నుంచి విత్తనకాయల పంపిణీ ప్రారంభమైంది. మూడు లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి వుండగా కేవలం 90 వేల కింటాళ్ల నిల్వలతోనే శనివారం నుంచి పంపిణీని అధికారులు ప్రారంభించారు. సోమవారం నాటికి కొన్ని విత్తన పంపిణీ కేంద్రాల్లో మధ్యాహ్నానికే విత్తన కాయలు స్టాకులేవంటూ అధికారులు పంపిణీని నిలిపివేశారు. వాటిలో రాప్తాడు కూడా ఉంది. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గార్లదిన్నె తదితర మండలాల్లో సర్వర్లు పనిచేయక రైతులు గంటల తరబడి క్యూలైనులో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వరి విత్తనాల కోసం, చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు గంటల తరబడి బారులు తీరారు. బయోమెట్రిక్ సక్రమంగా పని చేయకపోవడంతో కూడా జాప్యం జరిగింది.