Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు ఓకే
- సమ్మె విరమించిన వైద్యులు
- వైద్యులకు మరింత రక్షణ కల్పిస్తాం : మమతా బెనర్జీ
కోల్కతా : బెంగాల్లో వారం రోజులుగా సమ్మె చేస్తున్న వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంగీకరించారు. వైద్యుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి సమ్మె చేస్తున్న వైద్యుల ప్రతినిధుల బృందంతో సోమవారం ఆమె చర్చలు జరిపారు. కోల్కతాలోని నబన్నలోనే చర్చలు జరపాలని వైద్యులు పట్టుబట్టడంతో అక్కడే 31 మంది ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం ఓ వ్యక్తి చేసిన దాడిలో ఇద్దరు జూడాలకు తీవ్ర గాయాలైన నేపథ్యంలో వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. వీరికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో పనిచేస్తున్న జూడాల నుంచి మద్దతు లభించింది. వైద్యుల సమ్మె విరమణతో ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
చర్చల్లో భాగంగా వైద్యులు పలు డిమాండ్లను సీఎం ముందుంచారు. తమకు మరింత రక్షణ కల్పించాలని, భవిష్యత్లో ఇలాంటి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. 'మీ సమస్యలను నేను అర్థం చేసుకోగలను. మీరు చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. వైద్యులు, ఉపాధ్యాయులను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ ఆస్పత్రులలో వైద్య సేవలు అందక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోగులందరినీ మనం చెడ్డవారిగా పరిగణించలేం. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను' అని ఆమె ప్రతినిధుల బృందంతో చెప్పారు. వైద్యుల భద్రత కోసం ఆస్పత్రులలో నోడల్ పోలీసు ఆఫీసర్ను నియమించాలని కోల్కతా పోలీసు కమిషనరుకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'గ్రీవెన్స్ రీడ్రెసెల్ సెల్' ఏర్పాటు చేయాలన్న వైద్యుల డిమాండ్కు దీదీ అంగీకరించారు. వైద్యులపై తప్పుడు కేసులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులలో పబ్లిక్ రిలేషన్స్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రతిపాదించారు. వీరు రోగులకు, వైద్యులకు అనుసంధాన కర్తలుగా ఉంటారని ఆమె వైద్యులకు సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంపై తమకు విశ్వాసముందని.. అయితే, తీవ్రమైన భయాందోళనల కారణంగానే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని చర్చలకు హాజరైన ప్రతినిధుల బృందం ఆమెకు వివరించింది.
చర్చలకు ముందు కొంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమ్మె చేస్తున్న వారితో చర్చించేందుకు సిద్ధమని సర్కారు ప్రకటించిన నేపథ్యంలో.. చర్చలను బహిరంగంగా, టీవీ ఛానెళ్ల లైవ్ కవరేజీతో జరపాలని వైద్య సంఘాలు పట్టుబట్టాయి.
దీనికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. స్థానికంగా ఉండే ఒక్క ఛానెల్ను అనుమతిస్తామని చెప్పడంతో తాము చర్చలకు వెళ్లేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. తదనంతరం ప్రభుత్వ హామీతో సాయంత్రం 4 గంటలకు దీదీతో సమావేశం అయ్యారు.