Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలంటున్న ఐటీ సంస్థలు
- ఆస్పత్రులలో ఆపరేషన్లు బంద్..
- సామాన్య జనాల బాధలు వర్ణనాతీతం
చెన్నై : నీటి ఎద్దడితో తమిళనాడు అల్లాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వరుసగా మూడో ఏడాది సైతం చెన్నై మహానగర ప్రజలు నీటి కరువుతో నానా అవస్థలు పడుతున్నారు. చెన్నైకి నీటిని అందించే ప్రధాన చెరువులైన పోరూర్, రెడ్ హిల్స్, షోలవరం, చెమబరంబక్కం చెరువులు అడుగంటిపోయాయి. దీంతో సామాన్య ప్రజలే గాక బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఆస్పత్రులు, హౌటళ్లు కూడా నీళ్లు లేక అల్లాడుతున్నాయి. చెన్నైకి నీరందించే మంచినీటి చెరువులలో నీరు అడుగంటడంతో నగరానికి సమీపాన ఉన్న జిల్లాల నుంచి ట్యాంకర్లు, లారీల ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అవి ఎంతమాత్రమూ సరిపోవడం లేదని నగరవాసులు వాపోతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి కొరతతో ఐటీ కార్యాలయాలు వారి ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని (వర్క్ ఫ్రం హౌం) కోరుతున్నాయి. అవసరమైతే తప్ప ఆఫీసులకు రావొద్దని ఉద్యోగులకు సూచిస్తున్నాయని విష్ణుప్రియ అనే ఉద్యోగిని తెలిపారు. ఇక ఆస్పత్రులలో అయితే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. సరైన నీటి సదుపాయం లేకపోవడంతో జనరల్ వార్డులను శుభ్రపరచడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. అవసరముంటేనే సర్జరీలు చేయించుకోవాలని.. లేకుంటే కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి కరువుతో పలు హౌటళ్లు సైతం మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేశాయి. ప్లేట్ల స్థానంలో అరిటాకులు వేస్తున్నామని.. చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బోల్స్ను అందిస్తున్నామని చెన్నై హౌటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి తెలిపారు.
ఇక సామాన్య జనాల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఐదారు రోజులైన నీటి ట్యాంకర్లు రాకపోవడంతో బస్తీలలో ఉంటున్న వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు సైతం తాగడానికి నీటిని ఇవ్వలేకపోతున్నామని శంకర్నగర్కు చెందిన ఓ మహిళ వాపోయింది. కాగా చెన్నైలో నీటి కరువుపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ప్రజలకు తాగునీరు అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పళిని స్వామి నేతృత్వంలోని ఎఐఎడీఎంకే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదిలాఉంటే చెన్నైలో నీటి కొరత లేదని.. రోజూవారి నీటి సప్లై 830 మిలియన్ లీటర్ల నుంచి 535 మిలియన్ లీటర్లకు తగ్గిందని చెన్నై మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ టిఎన్ హరిహరన్ తెలపడం గమనార్హం.