Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
- ఒడిషాలో ఘటన
భువనేశ్వర్ : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మ గాంధీకి ఘోర అవమానం జరిగింది. ఒడిషాలోని ఓ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆయన జ్ఞాపకార్థం నామకరణం చేసిన స్కూలులోని ఓ గదిలో సైతం అసాంఘికంగా వ్యవహరించారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బాలాసోర్ పట్టణంలోని సోవ రాంపూర్ ప్రాంతంలో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దుర్మార్గం చోటు చేసుకున్నది. పాఠశాలలోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహం తల భాగాన్ని కూల్చారు. అలాగే స్కూలు గదిలో సిగరెట్ పెట్టెలు, ఖాళీ మందుసీసాలను చిందరవందరగా పడేశారు. . అంతేకాకుండా పాఠశాల పరిసర ప్రాంతంలో నాటిన మొక్కలు సైతం నేల మట్టం చేశారు. అయితే ఒకరోజు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పాఠశాలకు వెళ్లి చూశారు. గాంధీ విగ్రహం ధ్వంసం కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసులుకు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఈనెల 14న జరిగి ఉండొచ్చని సహదేవ్ఖుంట పోలీస్ స్టేషన్ అధికారి సుభ్రాన్సు శేఖర్ నాయక్ అన్నారు. పాఠశాలకు వేసవి సెలవులు ఉన్న తరుణంలో సంఘవిద్రోహ శక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని, దీనిలో రాజకీయ ప్రమేయమేమీ లేదని పోలీసులు తెలుపడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. విగ్రహ ధ్వంసంపై గాంధేయవాదులు నిరసనను వ్యక్తం చేశారు. నిందితు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రం యూపీతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో భారత రాజ్యంగ రూపకర్త, దళిత నాయకుడు అంబేద్కర్ విగ్రహాలపై దుండగులు పలుమార్లు దాడులకు దిగి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.