Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.6శాతమే : ఫిచ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ఊహించినదాని కన్నా తక్కువగా నమోదవుతోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ ప్రకటించింది. జీడీపీ వృద్ధి 6.6 శాతానికి
పరిమితమవుతుందని 'ఫిచ్' తాజా నివేదిక తెలిపింది. ఇప్పుడు నమోదైన వృద్ధి, గత ఐదేండ్లలో కనిష్టమని వెల్లడించింది. వ్యవసాయ, తయారీ రంగాల్లో నెలకొన్న సంక్షోభమే ఈ ఫలితాలకు కారణమని నివేదిక పేర్కొన్నది. రాబోయే సంవత్సరాల్లో 7.1శాతం, 7 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశమముందని అంచనావేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.8శాతంగా నమోదైంది. తాజా గణాంకాలను బట్టి, గత ఐదేండ్లుగా భారత జీడీపీ వృద్ధి తగ్గుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా తయారీరంగం నెమ్మదించటం, వ్యవసాయ సంక్షోభం కొనసాగటం వంటివి వృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపాయని ఫిచ్ తన నివేదికలో తెలిపింది. అంతేగాక గతకొంతకాలంగా భారత ఎగుమతులు కూడా పడిపోయాయని తెలిపింది. ఆర్థిక వృద్ధి పెంచటం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం కోసం ఈనెల మొదటివారంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించటం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.