Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీ దాడులతో కలకలం
- చర్యలు ముమ్మరం చేసిన కమలనాధులు
శ్రీనగర్ : కెేంద్రంలో రెండోసారి మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం, అది కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్షా కీలకమైన హోంమంత్రి పదవిని చేపట్టడంతో దశాబ్ధాలుగా స్వతంత్ర ప్రతిపత్తి గల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తాము అనుకున్న, చేయాలనుకున్న రాజకీయాన్ని బీజేపీ మొదలు పెట్టింది. జమ్మూకాశ్మీర్పై తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు మిలటరీయేతర చర్యలను మరింత ఉధృతం చేసేందుకు అమిత్షా ముందుకు సాగుతున్నారనే దానికి ఇటీ వల జరుగుతున్న ఘటనలు ఊతమిస్తున్నాయి. రాష్ట్ర ఫ్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనగర్లోని జమ్మూకాశ్మీర్ బ్యాంక్కు సంబంధించిన నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఆ బ్యాంకుపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఈనెల 8న దాడులు చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 35ఎ అధికరణను తొలగి స్తామని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలు ముఖ్యంగా అమిత్షా పదేపదే ప్రచారం చేశారు. ప్రచారపర్వం అనంతరం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ విజయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ అధిపత్యం కోసం రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరణ చేయడం, జమ్మూకాశ్మీర్ను మూడు రాష్ట్రాలుగా విడగొట్టడం అనే అంశాలపై మోడీ సర్కార్ ఆలోచన చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జమ్మూకాశ్మీర్ బ్యాంక్ చైర్మన్, ఎండీగా ఉన్న పర్వేజ్ అహ్మద్ను ప్రభుత్వం తొలగించిన అనంతరం కొద్ది వ్యవధిలోనే ఏసీబీ దాడులు జరిగాయి. ఆయన మూడేండ్ల పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్ను ముగియనుంది. ప్రస్తుతం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్న జమ్మూకు చెందిన ఆర్కె ఛబ్బీబేర్ను తాత్కాలిక చైర్మన్గా నియమించారు. ఏసీబీకి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేశామన్నారు. అయితే ఈ దాడులపై రాష్ట్రంలోని పలు ప్రాంతీయ పార్టీలు స్పందిస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ జమ్మూ ప్రాంతంలోని ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించాయి. బ్యాంక్ చైర్మన్ తొలగింపునకు సంబంధించి జమ్మూకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నేత మాట్లాడుతూ జమ్మూ ప్రజల మన్ననల కోసం, రానున్న కాలంలో రాష్ట్రానికి ఒక హిందువు ముఖ్యమంత్రి కావాలన్న తమ లక్ష్యాన్ని వారిలోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ఈ చర్య చేపట్టిందన్నారు. 1939లో ప్రారంభమైన ఈ బ్యాంకుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 26 మంది ఉన్నతాధికారుల్లో 11 మంది మాత్రమే ముస్లిములు ఉన్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న 1995 సమయంలో కెకె గుప్తా నేతృత్వంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ అసెంబ్లీ స్థానాలను 76 నుంచి 87కు పెంచింది. వీటిల్లో జమ్మూ ప్రాంతంలో 32 నుంచి 37కు, కాశ్మీర్ ప్రాంతంలో 42 నుంచి 46కు, లఢఖ్ రీజియన్లో 2 నుంచి 4 స్థానాలకు పెంచారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాశ్మీర్ లోయలో జనాభా 68,88,475 కాగా, వీరిలో అధికంగా 96.4 శాతం ముస్లిములే ఉన్నారు. జమ్మూ ప్రాంతానికి వచ్చే సరికి 53,78,538 మంది ఉండగా, వీరిలో అధిక శాతం(62.55) హిందువులు కాగా, ముస్లిములు 33.45 శాతం ఉన్నారు. ఇక లఢఖ్ ప్రాంతంలో 2,74,289 మంది జనాభా ఉండగా, హిందువులు(12.11 శాతం), ముస్లిములు(46.4), బౌద్ధ మతస్తులు(39.67) ఉన్నారు. అయితే 2026 వరకూ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిలిపేస్తూ, 2002లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఫరూక్ అబ్ధుల్లా ప్రభుత్వం రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ 47(3), జమ్మూకాశ్మీర్ ప్రజాప్రాతినిధ్య చట్టం-1957లో సవరణలు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫాంధర్స్ పార్టీ చైర్మన్ భీమ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు కొట్టేశాయి. రాజ్యాంగ సవరణపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ 2026 వరకూ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ లేకుండా చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో జులై 3వ తేదీతో రాష్ట్రపతి పాలన ముగియగా, దీన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నేపధ్యంలో భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై అర్డినెన్స్ జారీ అధికారం రాష్ట్రపతికి ఉంటుందని భీమ్ సింగ్ అంటున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది సాధ్యమౌతుంది తప్ప రాష్ట్రపతి ఏం చేయలేరని రాష్ట్రానికి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి జడ్ఎ.షా అన్నారు. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో జమ్మూకాశ్మీర్ అంశంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోనుందో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.