Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ చేయనున్న రాజకీయ ప్రముఖులు
- నూతన మంత్రులు, ఎంపీలకు కేటాయించనునన్న కేంద్రం
న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల ప్రారంభమైన తరుణంలో పలువురు కేంద్ర మాజీ మంత్రులు, రాజకీయ ప్రముఖులు గతంలో తమకు కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖాళీ అయిన ఈ బంగళాలలను కొత్త కేంద్ర మంత్రులు, ఎంపీలకు కేంద్ర పట్టణ గృహ మంత్రిత్వశాఖ కేటాయించనున్నది. ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో మొత్తం 19 చదరపు కిలోమీటర్ల పరిధిలో 300 బంగళాలు ఉన్నాయి. అందులో 80 బంగళాలు ఖాళీ అయితే వాటిని కొత్తవారికి కేటాయించనున్నారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రులు సుష్మాస్వరాజ్, సురేశ్ ప్రభు, రాం కృపాల్ యాదవ్, అనుప్రియాపటేల్, రాజెన్ గోహేన్, ఎంజే అక్బర్ లకు కేటాయించిన బంగళాలు ఉన్నాయి. వీటిని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలోని కొత్త కేంద్రమంత్రులకు కేటాయించే అవకాశం ఉన్నది. అలాగే 7 అక్బర్ రోడ్డులోని టైప్-3 బంగళా ఇప్పటికే ఖాళీ అయింది. ఇక్కడ మహేశ్శర్మ, జ్యోతిరాధిత్య సింధియా, మల్లిఖార్జున ఖర్గే, కె హెచ్ మునియప్ప , సుభాశ్ రామ్రావ్ భామ్రే లు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంది. కేంద్ర పట్టణ గృహ మంత్రిత్వశాఖ సిద్ధం చేసిన జాబితా ప్రకారం బంగళాలు ఖాళీ చేయాల్సిన వారిలో హన్స్రాజ్ గంగారాం అహిర్, చంద్రకాంత్ ఖైరే, విజరుసంప్లా, పిపి చౌదరి, అశోక్చవాన్, శివ్ప్రతాప్ శుక్లా లు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ ఒకనెల వరకూ గడవు ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే రమేశ్ పోక్రియాల్ నిశాంక్, సురేశ్ అంగాడీ వంటి కొందరు నూతన కేంద్ర మంత్రులు తమ నివాసాలను ఖాళీ చేసి పెద్ద బంగళాలకు మారనున్నారు. ఇదిలా ఉండగా 17వ లోక్సభకు తాజాగా 250 మంది కొత్త ఎంపీలు వచ్చి చేరారు. ఇందులో చాలా మంది ఎంపీలు సంబంధిత రాష్ట్ర భవన్లలో, అతిథి గృహాలలో ఉంటున్నారు. వీరి కోసం ఇప్పటికే 36 నూతన డూప్లెక్స్ ఫ్లాట్స్ను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మించింది. అయితే గతంలో కొందరు ఎంపీలు తాము మాజీలుగా మారినా అధికారిక బంగళాలను మాత్రం అలాగే అట్టిపెట్టుకొని ఉన్నారు. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.