Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగా ప్రక్షాళన ఇంకా టెండర్ల దశలోనే
- వచ్చే ఏడాదితో ముగియనున్న నిర్దేశిత గడువు
- ముప్పై శాతం కూడా పూర్తి కాని ఎస్టీపీలు
న్యూఢిల్లీ : 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమం నిర్దేశిత లక్ష్యానికి అందనంత దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన గడువు వచ్చే ఏడాదితో ముగుస్తున్నా గంగా నదిలోకి వచ్చే మురుగు నీటి శుద్ధి కోసం ఏర్పాటు చేయదల్చిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ)ల నిర్మాణం పలు రాష్ట్రాలలో ఇంకా టెండర్ల దశలోనే ఉంది. 2015 మే లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన 'నమామీ గంగే' కార్యక్రమం గడువు తేదీ 2020తో ముగియనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర సర్కారు రూ. 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.గంగా నది చుట్టూ ఉండే పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలు, పట్టణాల నుంచి వచ్చే మురుగు నీటిని సరాసరి నదిలోకే వదులుతుండటంతో ఆ నీరంతా కలుషితమవుతోంది. ఈ కారణంతో నది ప్రవహించే ఎనిమిది రాష్ట్రాల్లోని 97 పట్టణాలలో 150 ఎస్టీపీలను నిర్మించి నీటిని శుద్ది చేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. గంగా నదిలో రోజుకు 2,953 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగు నీరు వస్తుండగా.. ప్రస్తుతం ఈ పట్టణాలలో ఇప్పటికే ఉన్న పలు శుద్దీకరణ ప్లాంట్లు రోజుకు 1,794 ఎంఎల్డీల మురుగునీటిని మాత్రమే శుద్ది చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఎస్టీపీలను 4,874 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటివరకూ ఎస్టీపీల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి గత నెల 31 నాటికి 42 ఎస్టీపీలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా పనులు జరుగుతున్న దశలో ఉన్నవి 60 కాగా, 48 ఎస్టీపీలకు ఇంకా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఈ గణాంకాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది.
గణాంకాల ప్రకారం.. హర్యానాలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఎస్టీపీల నిర్మాణం పూర్తి కాలేదు. యూపీలో 50 ఎస్టీపీలను ప్రతిపాదించగా అందులో కేవలం 13 మాత్రమే పూర్తికావొచ్చాయి. బెంగాల్లో 22 ఎస్టీపీలను కేటాయించగా 3 మాత్రమే నిర్మాణమయ్యాయి. ఇక బీహార్, ఢిల్లీలలో గంగా శుద్ధి పనులు ఇంకా మొదలవ్వనేలేదు. పనులిలా నత్తనడకన సాగుతుంటే లక్ష్యంలోపు గంగా నదిని ప్రక్షాళన చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు, పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.