Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జమిలి' ఎన్నికలపై వామపక్షాలు
- ప్రజలకు ఉపయోగపడేది కాదు : సీపీఐ(ఎం) నాయకుడు ఎస్.రామచంద్రన్ పిళ్లై
న్యూఢిల్లీ : 'ఒకే దేశం...ఒకే ఎన్నిక'(జమిలి ఎన్నికలు) నినాదాన్ని మోడీ సర్కార్-2 మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ బలంగా వినిపిస్తున్న 'జమిలి ఎన్నికల' విధానాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానాలు భారత ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి వ్యతిరేకమని వామపక్షాల నాయకులు విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వహణపై న్యూఢిల్లీలో నేడు కీలక సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నాయకులందర్నీ ప్రధాని మోడీ ఆహ్వానించారు.
ఈనేపథ్యంలో సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు ఎస్.రామచంద్రన్ పిళ్లై మాట్లాడుతూ, ''జమిలి ఎన్నికల నిర్వహణ అశాస్త్రీయమైనదేగాక, అసాధ్యం కూడా. ప్రజల ప్రయోజనాల్ని, ప్రజాస్వామ్యహక్కుల్ని దెబ్బతీస్తుంది. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతే పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగేవరకూ ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అప్పుడు సమాఖ్య వ్యవస్థ అన్నదానికి ఏమైనా విలువ ఉంటుందా?''అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తున్న పార్టీకి అనుకూలించేది తప్ప, ప్రజలకు ఉపయోగపడేది కాదని అన్నారు. ఆగస్టు 2018లోనే ఈ అంశంపై న్యాయ కమిషన్ ముందు సీపీఐ(ఎం) తన వాదనను వినిపించింది. జమిలి ఎన్నికలు తీసుకురావటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.
ఎన్నికల్లో అవినీతిపై ఆలోచించండి : సీపీఐ నాయకుడు డి.రాజా
సీపీఐ కూడా 'జమిలి ఎన్నికల' విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఒకే జాతి, ఒకే భాష, ఒకే అధికార పార్టీ, ఒకే సంస్కృతి... తీసుకురావటం కోసం ప్రధాని మోడీ, ఎన్డీయే నాయకులు ఎంచుకున్న వ్యూహమిదని సీపీఐ నాయకుడు డి.రాజా విమర్శించారు. దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నమిదని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...''ఇది అశాస్త్రీయమైనదేగాక... అప్రజాస్వామిక మైనది కూడా. 'జమిలి ఎన్నికల' గురించి ఆలోచించటం కాదు, ఎన్నికల సంస్కరణల గురించి ఆలోచించాలి. ఎన్నికల్లో అవినీతిని అడ్డుకోవటం గురించి ఆలోచించాలి''అని అన్నారు.