Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభలో ఆసక్తికర పరిణామాలు
- సభలో హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అత్యుత్సాహం
- జై తెలంగాణ.. జై భారత్ అన్న ఎంపీలు
- జై భీమ్ స్లోగనిచ్చిన అసద్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
17వ లోక్సభలో సభ్యులుగా తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రాష్ట్రంలోని 16 ఎంపీలు తాము సభా వ్యవహారాలు, నియమ నిబంధనలకు అను గుణంగా ఉంటామని ప్రమాణం చేశారు. అయితే, సికింద్రాబాద్ నుంచి గెలిచిన గంగాపురం కిషన్రెడ్డి కేంద్రమంత్రి కావడంతో ఆయన మొదటి రోజే మంత్రుల కోటా నుంచి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో, మిగిలిన 16 మంది ఎంపీలు వివిధ భాషల్లో చేసి సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నుంచి 9 మంది ఎంపీలు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేశారు. సభ్యుల ప్రమాణం సందర్భంగా లోక్సభలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమాణం చేసే సమయంలో కొందరు సభ్యులు తడబడ్డారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేవగానే జై భారత్ నినాదాలు సభలోని బీజేపీ ఎంపీలు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హౌరెత్తించారు. దీంతో ఆయన ఇంకా చేయండంటూ సంజ్ఞలతో వారిని రెట్టించారు. జై భీం, జై హింద్ నినాదాలు చేసిన అసద్, ఉర్దూలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఇక కాంగ్రెస్ నాయకుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మొబైల్లో చూస్తూ తడబడ్డారు. సర్వసత్తాక అధికారం అనే పదాన్ని పలకడంలో రేవంత్ ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ఎంపీలలో వెంకటేశ్ నేతకాని, బండి సంజరు కుమార్, సోయం బాపూరావ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోతు కవిత, నామా నాగేశ్వర రావు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ధర్మపురి అరవింద్, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇంగ్లీషులో చేశారు. బీబీ పాటిల్ హిందీలో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణం తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రమాణం జై తెలంగాణ, జైజై భారత్ నినాదాలు చేశారు. బండి సంజరు కుమార్, ధర్మపురి అరవింద్ భారత్ మాతాకీ జై అనగా, బీబీ పాటిల్ జై తెలంగాణ, జైజై తెలంగాణ, ఉత్తర్ కుమార్ రెడ్డి జై హింద్ జై తెలంగాణ, మాలోత్ కవిత జై తెలంగాణ, జై బంజారా నినాదాలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి అత్యుత్సాహం
రెండో రోజు పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ప్రమాణస్వీకారం జరుగుతున్న సమయంలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్ మాతాకీ జై అనాలని సూచించారు. జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన వెనకనే ఉన్నట్టువంటి కిషన్ రెడ్డి కల్పించుకోని.. భారత్ మాతాకీ జై అను పాటిల్ అని గట్టిగా చెప్పగా, ఆయన పట్టించుకోకుండా ప్రొటెం సభాపతి చెంతకు వెళ్ళారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జై భారత్, జై తెలంగాణ అని నినదించడంతో.. గుడ్ ప్రభాకర్ అంటూ కిషన్ రెడ్డి బల్లను చరిచారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాణం చేసేందుకు వస్తుండగా... కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని... మీ పార్టీ వాళ్ళు ఎవరు కొట్టకున్నా తాను కొడుతాలే అన్న అంటూ బల్లలు చరిచారు. ఇందుకు స్పందనగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.... సభలో ఉన్నావు కదా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి గట్టిగా సమాధానమివ్వగా,.. అయితే, అందుకే కొడుతున్న అన్నా అని ఆయన బదులిచ్చారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత ప్రమాణం అయిపోగానే జై తెలంగాణ.. జై బంజారా.. అని నినాదం చేశారు. కిషన్ రెడ్డి కల్పించుకొని భారతమాత కూడా అను తల్లి అని కవితకు చెప్పాగా, ఆమె ఏ విధమైన స్పందన ఇవ్వకుండానే స్పీకర్కు అభివాదం చేసేందుకు ముందుకు కదిలారు.
ఆ కవితమ్మ పోయే... ఈ కవితమ్మ వచ్చే!
ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్న సమయంలో స్పీకర్ ఛాంబర్ అధికారులు శ్రీమతి కవిత అని సంభోధించడంతో... కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ వెనకనే ఉన్న కిషన్రెడ్డిని కేసీఆర్ కా బేటీ ఆగయా హే క్యా? (కేసీఆర్ గారి కూతురు గెలిచిందా? ) అని అడిగారు. కిషన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ఆ కవితమ్మ పోయింది... ఈ కవితమ్మ వచ్చిందని ఆయన వివరించి చెప్పారు. దీంతో సభా ప్రాంగణమంతా నవ్వులు విరిశాయి.