Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్మంతర్లో కాంగ్రెస్ నేత విహెచ్ ఒక రోజు దీక్ష
- నిరసనకు మద్దతు తెలిపిన కుంతియా,
మాజీ ఎంపీ హర్ష కుమార్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్లోని పంజగుట్ట చౌరస్తాలో మున్సిపల్ అధికారులు తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పునఃప్రతిష్టించాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు నిరసనగా ఆయన గురువారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమంతరావు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ రామచంద్ర కుంతియా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్సీ కుంతియా మాట్లాడుతూ.. దళిత నేత అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్కి దళితులంటే చిన్నచూపు అని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని పార్లమెంట్లోని ఉభయసభల్లోనూ చర్చించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అనంతరం మాజీ ఎంపీ విహెచ్ మాట్లాడుతూ... పంజగుట్ట అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల ఆదేశాల ప్రకారమే అధికారులు కూల్చినట్టు ఆరోపించారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలంటూ 24 గంటల పాటు ధర్నా చేపట్టినట్టు ఆయన తెలిపారు. తాను ధర్నా చేస్తే కూల్చివేసిన మునిసిపల్ కార్మికులపై సర్కారు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ఈ అంశం తెలియాలని తాను ఢిల్లీలో ధర్నా చేపట్టినట్టు వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు లేకపోతే రాష్ట్ర విభజన జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అంబేద్కరే కారణమన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... ఎన్నికల పేరుతో రాజ్యాంగ రూపకర్త విగ్రహాన్ని లాకప్లో పెట్టడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ విగ్రహా కూల్చివేత అంశం పార్లమెంట్ సభ్యులు రెండు సభల్లో లేవనెత్తాలని సూచించారు. బాబాసాహెబ్ ఏమైనా దేశద్రోహా అని నిలదీశారు. అంబేద్కర్కి ఇంత అన్యాయం జరుగుతున్న టీఆర్ఎస్లోని దళితనేతలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించేంత వరకు తాను పోరాడుతానని విహెచ్ చెప్పారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.