Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక సమీకరణల వైపు బీజేపీ చూపు
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ డి శ్రీనివాస్ ఆ పార్టీ షాక్ ఇవ్వనున్నారా? అంటే అవునని అంటున్నాయి బీజేపీ వర్గాలు. గురువారం కేంద్ర హౌంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా పార్లమెంట్లోని సెంట్రల్ హాల్ పలువురు బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్న డీఎస్ గురువారం ఏకంగా పార్లమెంట్లోని అమిత్ షా ఆఫీస్కి వెళ్ళి సంచలనం సష్టించారు. బుధవారమే టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ప్రత్యక్షమైన రాజ్యసభ సభ్యులు డీఎస్.. మరుసటి రోజున అమిత్ షాతో భేటీ కావటం హాట్ టాపిక్గా మారింది. కొన్నాండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న డీఎస్... పార్లమెంట్లో జరిగిన టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశానికి హాజరయ్యారు. పొరపొచ్చాల అనంతరం ఆయన పార్టీకి మళ్లీ దగ్గరవుతున్నారనే వార్తలు నడుస్తుండగానే... ఒక్క రోజు వ్యవధిలోనే ఆయన అమిత్ షాని కలిసి వార్తల్లో నిలిచారు. ఒకవేళ పార్టీ, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చర్చించడానికే ఆయన అమిత్ షాని కలిశారనుకున్నా... ఆయనతో పార్టీ నేతలు, ఎంపీలు ఎవరూ లేకపోవడం కొత్త వాదనలకు తెరతీసింది. నిజామాబాద్లో తనయుడు ధర్మపురి అరవింద్ గెలుపు... స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత ఓటమి వెనుక ఉన్నది కూడా డీఎస్యేనన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆపరేషన్ బీజేపీ నడిపిస్తున్నది ఆయనేనా..? లేక డీఎస్ టీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కమలదళంలో చేరబోతున్నారా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక రాజకీయాలపై ఆపరేషన్
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ సామాజిక రాజకీయాలకు తెరలేపినట్టు వార్తలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రెండు సామాజికవర్గాలే తెలంగాణలో బలంగా ఉండగా, బీసీల్లోని అగ్రవర్ణంగా పేరొందిన ఓ సామాజిక వర్గంపై బీజేపీ ఆశలు పెట్టుకున్నది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీల్లో ఇద్దరు ఆ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. దాంతోపాటు, పార్టీ అధ్యక్ష పదవిని కూడా బీసీల్లో మంచి నాయకుడి చూడండని బీజేపీ అధిష్టానం ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖకు ఆదేశించడం కూడా.. ఇందులో భాగమేనని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ పార్టీలోకి తీసుకొని ఆయన రాజకీయ అనుభవం, సామాజికవర్గ మద్ధతు పొందాలని కమలం పార్టీ తీవ్రంగా యత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు డీఎస్ త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 17వ తేదీన బీజేపీ హైదరాబాద్లో భారీ సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నాయకులను పార్టీలో ఆహ్వనించే కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఇక డీఎస్ విషయంలో పార్టీ విప్ కింద టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ చైర్మెన్కి ఫిర్యాదు చేసినా... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో మాట్లాడి డీఎస్పై అనర్హత వేటు పడకుండా చూస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు బీజేపీవర్గాల నుంచి తెలుస్తోంది. అందుచేతనే, డీఎస్ అమిత్ షా ఆఫీస్కి వెళ్ళి నిర్భయంగా కలిసినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు.