Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారసత్వ భూమి హక్కు చట్టంపై మోడీ మౌనం
- ప్రాథమిక హక్కులను విస్మరించిన కేంద్ర ఆర్థిక శాఖ
- మహిళా సాధికారతకు అమలు తప్పనిసరి!
న్యూఢిల్లీ : పితృస్వామ్య వ్యవస్థలో దోపిడీ, పీడనలకు గురయ్యేది మహిళే. ఆస్తి హక్కు నిరాకరించి 'ఆమె'ను ఈ వ్యవస్థ బానిసలా మార్చింది. సాధికారత, స్వావలంబనకు ఆమడదూరంలో నిలిపింది. కేంద్రంలోని కాషాయపార్టీ పితృస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయబూనిందనడానికి ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే మహిళా రైతుల సాధికారతకు కీలకమైన చట్టాన్ని కేంద్ర ఆర్థిక శాఖ విస్మరించింది. మహిళా రైతులు వారసత్వ భూమి పొందే ప్రాథమిక హక్కులను పట్టించుకోలేదు. పురుషులకు సమానంగా మహిళలూ భూ యాజమాన్య హక్కు పొందే చట్టం అమలుకు ఎలాంటి ప్రణాళికలూ ప్రకటించలేదు.వ్యవసాయంలో మహిళల శ్రమ కీలకమైంది. రెండు దశాబ్దాలుగా పురుషులు వ్యవసేయతర రంగాల్లో చేరుతుండటంతో సాగులో మహిళల పాత్ర మరింత పెరిగింది. సాగులో వారి పాత్ర పెరుగుతున్నప్పటికీ భూ యాజమాన్య వాటాలో మాత్రం అది ప్రతిఫలించడంలేదు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో మహిళల ఆధీనంలో సాగుకు అనువైన భూమి రెండు నుంచి ఐదుశాతం మాత్రమే ఉన్నదని అంచనాలున్నాయి. భూ యాజమాన్య హక్కులు లేకపోవడంతో రుణ సదుపాయం, ఇతర ఇన్పుట్స్ అందక సాగు వృద్ధి తగ్గిపోతున్నదని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా రైతులకు భూ యాజమాన్య హక్కునివ్వడంపై చర్చ నడుస్తున్నది. అంతేకాదు, మహిళలు ఈ హక్కులు పొందితే.. వివాహ సంబంధంలో హింస తగ్గడం, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సాధికారత, వారికి వేతనాల పెరుగుదల లాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న అభిప్రాయాలు బలంగా వస్తున్నాయి.
స్వాతంత్య్రానంతర భూ చట్టాలు :
సంపాదించిన లేదా వారసత్వ సంపద హక్కుదారులను 1956కు ముందు ఆయా కమ్యూనిటీల నిబంధనలు నిర్ధారించేవి. కాగా, సంపాదించిన ఆస్తిలో మహిళలకు సమాన హక్కుల(ముఖ్యంగా పట్టణాల్లో)ను హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కల్పించింది. కానీ, వారసత్వ ఆస్తిపై మహిళలకు హక్కులను కల్పించలేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ (సవరణ) 2005 లింగ వివక్షను తొలగించింది. సంపాదించిన ఆస్తితోపాటు వారసత్వ సంపదపై పురుషులతో మహిళలకూ సమాన హక్కులను ఈ సవరణ చట్టం కల్పించింది. అంతేకాదు, రాష్ట్రాల్లో ఇందుకు విరుద్ధమైన చట్టాలున్నప్పటికీ వాటిని పట్టించుకోనవసరం లేకుండా ఈ సవరణ ఉంది. ఈ చట్టం వ్యవసాయరంగంలోని మహిళలకు ఎంతో లబ్ది చేకూరుస్తుంది. కానీ, అమలు కావడం లేదు. అమలు చేయాలని డిపార్ట్మెంట్ ల్యాండ్ రీసోర్సెస్ లేదా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలకు ఎలాంటి సర్క్యూలర్నూ జారీ చేయలేదు. రాష్ట్రాలూ ఈ చట్టంపై అలసత్వం ప్రదర్శించాయి. న్యాయపరమైన మార్గదర్శకాలున్నప్పటికీ కుటుంబంలో చిక్కులొస్తే తల్లిగారి కుటుంబ సహకారాన్ని ఆశించి మహిళలూ క్లెయిమ్ చేసుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు.
బీజేపీ సర్కారు నిర్లక్ష్యం
డిపార్ట్మెంట్ ల్యాండ్ రీసోర్సెస్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక కొత్త కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించాల్సి ఉందని మహిళా సంఘాలు అంటున్నాయి. మహిళల హక్కులకు అనుగుణంగా భూ యాజమాన్య హక్కులను ఇస్తున్నట్టు సమాచారమిచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందని కార్యకర్తలు చెబుతున్నారు. మహిళలూ తమ హక్కులను ఉద్ఘాటించేందుకు, న్యాయపరమైన చిక్కులకు ఉచిత సహకారాన్ని అందించేలా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, పితృస్వామ్య మైండ్సెట్ నుంచి బయటపడేందుకు తహసీల్, పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం అమలుకు గడువును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించాలని, 2024లోపు కనీసం 30శాతం సాగు భూమిని మహిళా రైతుల పేరిట నమోదయ్యేలా కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 2004-05 నుంచి మొత్తంగా మహిళా కార్మికులు తగ్గిపోతున్నారు. 2011-12తో పోల్చితే 2017-18లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎనిమిది పాయింట్లు తగ్గి 23.3 శాతానికి పడిపోవడం గమనార్హం. మహిళా కార్మికులు ఉపాధికి దూరమవుతున్నకొద్దీ వారు పురుషులపై ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో పితృస్వామ్యం మరింత బలపడుతుందన్న విషయం తెలిసిందే. ఆదాయాల పంపకం కన్నా ఆస్తుల పంపకానికే లింగ వివక్షను రూపుమాపే శక్తి ఎక్కువ ఉంటుంది. మహిళా సాధికారత కోసం ఆస్తి హక్కూ కీలకమన్నది గుర్తుంచుకోవాలని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. మహిళ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇలాంటి అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ తప్పనిసరిగా గుర్తించాలని అభిప్రాయపడుతున్నారు.