Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియాలో 52 కోట్ల జనాభాకు తాగునీటి సమస్య :ఐక్యరాజ్యసమితి
- ఆగస్టులో అధికారికంగా విడుదల
న్యూఢిల్లీ: వాతావరణం మార్పులతో భూతాపం రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణాగ్రత పెరిగితే ప్రభావితమయ్యే దేశాల్లో ఇండియా ఉంటుందని ఐక్యరాజ్యసమితి(యూఎన్) నివేదిక అంచనా వేసింది. దీనివల్ల భారత్లో తీవ్ర నీటి ఎద్దడికి గురయ్యేవారి సంఖ్య 52 కోట్లుగా ఉంటుందని తెలిపింది. నేల పొడిబారడం, నీటి వనరుల కొరత వల్ల నివాసయోగ్య ప్రాంతాల విస్తీర్ణం తగ్గుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులపై పలు దేశాల శాస్త్రవేత్తలతో ఏర్పాటైన కమిటీ ఈ నివేదికను రూపొందించింది. యూఎన్లో సభ్యత్వమున్న 197 దేశాలకు ముసాయిదాను అందజేశారు. సభ్యదేశాల ఆమోదంతో నివేదికను అధికారికంగా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. వాతావరణ మార్పులపై ప్రభుత్వాల అంతర్గత కమిటీ(ఐపీసీసీ) యూఎన్ దీనిని విడుదల చేయనున్నది. కాగా, నివేదికలోని కొన్ని కీలకాంశాలు ముందుగా లీకయ్యాయి. ఈ శతాబ్దాంతానికి(2100 వరకల్లా) భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల దిగువకే కట్టడి చేయాలన్న పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించడంలో సఫలమైతే పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుందని నివేదికలో సూచించారు.
2050కల్లా 29 శాతం పెరగనున్న తృణధాన్యాల ధరలు
అదేవిధంగా 2050 వరకల్లా ప్రపంచవ్యాప్తంగా తృణధాన్యాల ధరలు 29 శాతం పెరగనున్నట్టు యూఎన్ అంచనా వేసింది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆహార భద్రతలో కీలకమైన నాలుగు అంశాల(లభ్యత, అందుబాటులో ఉండటం, వినియోగం, స్థిరత్వం)ను ప్రభావితం చేసినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు నేల స్వరూపంలోనూ మరింత ప్రతికూల మార్పు వస్తుందని నివేదికలో స్పష్టం చేశారు. 'ఎడారీకరణ పెరుగుతుంది, భూసారం క్షీణిస్తుంది, ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది' అని హెచ్చరించారు.
ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపుతుందని నివేదిక స్పష్టం చేసింది. భూతాపం పెరగడం వల్ల బహుళ వైపరీత్యాలు సంభవిస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. భూమిపై ఓవైపు అతివృష్టి ఏర్పడితే, మరోవైపు అనావృష్టి ఉంటుంది. ఈ రెండు పరిస్థితులూ వ్యవసాయ ఉత్పత్తులను తగ్గించేవేనని నివేదిక తెలిపింది. భూతాపం పెరగడం వల్ల వ్యవసాయంపై ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. ఎగువ దేశాల్లో జొన్న, గోధుమ, బార్లీ, పత్తి, చెరుకు ఉత్పత్తి అధికంగా ఉంటుందని, దిగువ దేశాల్లో(భారత్లాంటివి) ఈ పంటల దిగుబడి తక్కువగా ఉంటుంది. దీంతో, తృణధాన్యాల ధరలు పెరుగుతాయని నివేదిక తెలిపింది.