Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం లేఖలు సాధారణమే
- పెట్టుబడులు రావనేది
తప్పుడు ప్రచారం: ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజరు కల్లాం
అమరావతి: విద్యుత్ ఒప్పందాలపై సమీక్షలు చేయడం ఖాయమని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018-19 ఆర్ధిక సర్వేలో దేశ వ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ధరలు గణనీయంగా తగ్గాయని ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాన్ని గుర్తుచేశారు. 2010 సంవత్సరంలో 18 రూపాయలుగా ఉన్న సౌర విద్యుత్ యూనిట్ (కిలోవాట్స్ పర్ అవర్) ధర 2018 నాటికి రూ.2.44 పైసలకు పడిపోయిందని తెలిపారు. పవన విద్యుత్ కూడా 2017 డిసెంబర్కే సగటున రు.4.20 నుండి రూ.2.43 లకు పడిపోయిందని వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వం యూనిట్ రూ.6 లకు పీపీఏలు కుదుర్చుకుందని చెప్పారు సాఫ్ట్ బ్యాంకు ఎనర్జీ సంస్థ యూనిట్ రూ. 2.71 రూపాయలకు టెండర్ దాఖలు చేస్తేనే రింగ్ అయిందని పేర్కొంటూ కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన అదే సంస్థ యూనిట్ 4.63రూపాయలకు కర్నూలు జిల్లాలో 350 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేసిందని, . అక్రమాలు లేకుండానే యూనిట్ ధర రాష్ట్రంలో అంతగా పెరిగిందా అని ప్రశ్నించారు. ఇవే అంశాను 'కేంద్రం రెండు నాల్కల ధోరణి' శీర్షికతో సోమవారం ప్రజాశక్తి వార్త కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ధరలు తగ్గుతున్నా అత్యధిక రేటుకు అప్పటి ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుందో తేలాల్సి ఉందని ఈ సందర్భంగా అజేయకల్లం అన్నారు. దీనికోసమే సమీక్ష నిర్వహించాల్సిఉందని చెప్పారు,. రాష్ట్రంలో సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి ఉందని, అధిక ధరల కు ఒప్పందాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువ ధరకే విద్యుత్ లభ్యమవుతుందని, అయినా ఎక్కువ ధరకు ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పీపీఏల వల్ల ప్రతి ఏటా రూ.2,500కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చయిందని చెప్పారు. పీపీఏలు లేకుండానే యూనిట్ రూ.2.72లకు అందిస్తామని అనేక కంపెనీలు ముందుకొచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అదానీ, టాటా, ఎస్సార్ వంటి సంస్థలు చౌకధరకు విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో చర్చలు జరుపుతామని, ధరలు తగ్గిస్తే పాత ఒప్పందాలను కొనసాగిస్తామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమీక్షలు చేయాలని అన్నారు. పీపీఏలు సమీక్షిస్తే తప్పు చేయనివారికి భయమెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో 133 పీపీఏలు ఉన్నాయని అందులో 5 కంపెనీలవే 70శాతం వాటా ఉందని తెలిపారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ డిస్కంలు రుణపరిమితి దాటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయని తెలిపారు. ఇవి చెల్లించలేకపోతే డిసెంబర్ నాటికి రూ.450కోట్లు అదనంగా భారం పడుతుందన్నారు. ఇప్పటికే వినియోగదారులపై అధిక భారం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పివి రమేష్, ట్రాన్స్కో జెఎండి చక్రధర బాబు పాల్గొన్నారు.