Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంలో వర్ష బీభత్సం
- మునిగిన 28 జిల్లాలు
- వరదల ధాటికి నిరాశ్రయులైన 27 లక్షల మంది ప్రజలు
- మేఘాలయా, త్రిపురలోనూ వరదలు
గువహతి, అగర్తల, పాట్నా : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఈశాన్య భారతం అతలాకుతలమవుతోంది. అసోం, త్రిపుర, మేఘాలయా, అరుణాచల్ప్రదేశ్లలో పారే నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో స్థానిక గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అసోం ఆగమాగం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు (33) వరద నీటిలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో ప్రజలందరూ ప్రాణాలరచేతిలో పెట్టుకుని భయం గుప్పిట్లో బతుకులీడుస్తున్నారు. బ్రహ్మపుత్రతో పాటు బుర్హి దిహింగ్, సుబన్సిరి, డన్సిరి, జియ భరలి, కప్లి, పుతిమరి, బెకి, బరాక్, కటఖల, కుషియారా నదులు సైతం ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలన్నీ కొండ ప్రాంతాలు కావడంతో వరదలకు తోడు రహదారులపై భారీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జనాలు సురక్షిత ప్రాంతాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 27 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాతీయ విపత్తు సహాయక బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) వీరికి సాయం అందిస్తున్నాయి. అసోంలో ఉన్న కజిరంగ జాతీయ పార్కు దాదాపు 90 శాతం నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ఉన్న జంతువులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, కర్బిఅంగ్లాంగ్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఏడు అడవి జింకలు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలో బర్పెట, మొరిగావ్, కమ్రూప్, కర్బి అంగ్లాంగ్, గువహతి, దుబ్రి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలో అసోంలో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. వరద పరిస్థితులపై సీఎం సర్బనంద సోనోవల్ అధికారులతో ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
త్రిపురలోనూ...
త్రిపురలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలుప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల ధాటికి ఎనిమిది జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు పదివేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. హౌరా నది ప్రవాహంతో రాజధాని అగర్తలాలోని శ్రీలంక బస్తీ, బల్దాకల్, అంబేద్కర్ కాలనీ, ప్రతాప్గఢ్లు నీట మునిగాయి. దీంతో 2,500 మందిని 25 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
మేఘాలయాలో..
ఏడు రోజులుగా మేఘాలయాలో కురుస్తున్న వర్షాలతో బ్రహ్మపుత్ర, జింజిరం నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వెస్ట్ గారో జిల్లాలోని డెమ్డెమ, సెల్సెల బ్లాక్ల పరిధిలో ఉన్న 140 గ్రామాలు జలమయమయ్యాయి. దాదాపు లక్ష మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు తెలిపారు.
బీహార్ను ముంచెత్తుతున్న వరదలు
బీహార్లో వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా తొమ్మిది జిల్లాల్లోని ప్రజల బతుకులు అస్తవ్యస్తమయ్యాయి. బీహార్ విపత్తు నిర్వహణ అధికారుల వివరాల ప్రకారం దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. 48 గంటలుగా రాష్ట్రంలోని కోసి, గండక్, భాగ్మతి, గంగా, బుద్ధి నదులు ఉధృతంగా ప్రవహిస్త్తున్నాయి. దీంతో వరద ముంపునకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రమాదకర సూచీలు ఎగురవేసిన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అరేరియా, కిషన్గంజ్, మధుబని, షోహర్, ఈస్ట్ చంపారన్, సుపొల్, ముజఫర్పూర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 19.65 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమైనట్టు సమాచారం. ఇందులో దాదాపు పది లక్షల మంది ఒక్క సీతామర్హి జిల్లాలోనే ఉండటం గమనార్హం. వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు సమాచారం.
కాగా నిరాశ్రయులైన వీరందరికీ పునరావాస వసతులు కల్పించడంలో నితీశ్ కుమార్ సర్కారు దారుణంగా విఫలమైందని బాధితులు వాపోతున్నారు. వరదలు వస్తాయని తెలిసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బాధితులను బహిరంగ ప్రదేశాలలో, చెట్ల కింద, జాతీయ రహదారుల కింద ఉంచడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించడానికని వెళ్లిన మధుబనీ జిల్లా ఝంజర్పూర్ ఎంపీ రాంప్రీత్ మండల్ (బీజేపీ)ను ప్రజలు ఘెరావ్ చేశారు. వరద ముంపు చర్యలు చేపట్టకుండా ఇక్కడకు రావొద్దని వారు ఆందోళన చేపట్టారు. కమ్లా బలన్ నది ఉప్పొంగుతుండంతో ఈ జిల్లా ప్రజలందరూ వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. అలాగే మరో బీజేపీ ఎంపీ, అరేరియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రదీప్ కుమార్ సింగ్ను సైతం ప్రజలు ఘెరావ్ చేశారు. ఆయన రాకను నిరసిస్తూ 'గో బ్యాక్ ఎంపీ' అంటూ నినదించారు.