Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోతున్న లింగ నిష్పత్తి
- గతమూడేండ్లుగా తగ్గుదల
- కేరళలో శిశుమరణాలు అత్యల్పం : తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశం భారత్లో 'జననాల రేటు' తగ్గుతూ వస్తోంది. కారణాలేమైనా మరణాల రేటు కూడా తగ్గింది. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ శిశుజననాల్లో లింగనిష్పత్తి పెరగటం లేదు. గత మూడేండ్లలో (2015-17) తగ్గుదల నమోదైంది. ప్రతీ వెయ్యిమంది మగశిశువుల జననానికి కేవలం 896 మంది (2017లో) ఆడశిశు జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది 2016లో 898గా నమోదైంది. గతేడాది కన్నా ప్రస్తుతం 2పాయింట్లు తగ్గింది. మొత్తంగా ఆడ శిశుజననాలు పడిపోవటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని గణాంకవేత్తలు పేర్కొంటున్నారు. జనాభా గణాంకాలకు సంబంధించి తాజాసర్వేలో ఈవిషయాల్ని అధికారులు వెల్లడించారు. 2015, 2016, డిసెంబరు 31, 2017 నాటి సమాచారాన్ని 2018లో సర్వే చేసి ఈ గణాంకాల్ని రూపొందించారు. ఈ సర్వే వివరాల్ని అధికారులు తాజాగా మీడియాకు విడుదలచేశారు.
2011 జనాభా లెక్కల్లో మొత్తం లింగ నిష్పత్తి 940. దీనర్థం.. దేశంలో ప్రతీ వెయ్యిమంది పురుషులకు 940మంది స్త్రీలున్నా రని. ఇప్పుడది మరింత కిందకు పడిపోయి అవకాశం ఏర్పడింది. ఆడ శిశుజననాలు క్రమంగా పడిపోతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 961, అత్యల్పం హర్యానాలో 833 నమోదైంది.
జననాల రేటు తగ్గింది!
ఒక ఏడాదిలో ప్రతీ వెయ్యిమంది జనాభాకు పుడుతున్నవారిని 'క్రూడ్ బర్త్ రేట్'(సీబీఆర్)గా పరిగణిస్తారు. ఈ సీబీఆర్ 2016లో 20.4 ఉంది. అంటే, ప్రతీ వెయ్యిమంది జనాభాకు జననాలు 20.4. ఈ సీబీఆర్ 2017నాటికి 20.2కు తగ్గింది. ఇక్కడ జననాలు 0.2పాయింట్లు తగ్గింది. సీబీఆర్ అత్యధి కంగా బీహార్లో 26.4 నమోదైంది. దేశవ్యాప్తంగా 2012 -2017మధ్య సీబీఆర్ 1.4 పాయింట్లు పడిపోయింది. సీబీఆర్ గ్రామాల్లో 1.3 పాయింట్లు, పట్టణాల్లో 0.6పాయింట్లు తగ్గుదల నమోదైంది.
మరణాలు ఛత్తీస్గఢ్లో అత్యధికం
ప్రతీ వెయ్యిమంది జనాభాకు మరణించిన వారి సంఖ్యే 'క్రూడ్ డెత్ రేట్'(సీడీఆర్). అంటే ఆ ఏడాది ప్రతీ వెయ్యిమంది జనాభాలో ఎంతమంది చనిపోయారన్నది సీడీఆర్ సంఖ్య తెలుపుతుంది. జాతీయస్థాయిలో 2017లో ఈ సీడీఆర్ 6.3గా నమోదైంది. ప్రతీ వెయ్యిమంది జనాభాలో 6.3మంది చనిపోయారని దీనర్థం. ఈ సీడీఆర్ ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 7.5, అత్యల్పం ఢిల్లీలో 3.7 నమోదైంది. గత ఐదేండ్లలో మొత్తంగా జాతీయ మరణాల రేటు స్వల్పంగా 0.7 పాయింట్లు తగ్గింది.
- మహిళల మరణాల రేటు 0.5 పాయింట్లు, పురుషుల మరణాల రేటు 1 పాయింటు తగ్గాయి.
- వైద్యవసతులు మెరుగుపడటం మరణాల రేటును తగ్గించిందని సర్వే అభిప్రాయపడింది. 1971-1981మధ్య మరణాల రేటు 14.9 నుంచి 12.5 పాయింట్లుగా నమోదైంది.
- అలాగే 1991-2017మధ్య మరణాల రేటు 9.8 నుంచి 6.3కు తగ్గింది.
- ఐదేండ్లలోపు చిన్నారుల మరణాల రేటు కూడా తగ్గింది. ఇది 2016లో 34 పాయింట్లు ఉంటే, 2017లో 33 పాయింట్లకు చేరుకుంది.
- శిశుమరణాల రేటు అత్యధికంగా మధ్యప్రదేశ్లో 47 పాయింట్లు, అత్యల్పం కేరళలో 10పాయింట్లు నమోదయ్యాయి.
- 2012-2017మధ్య జాతీయస్థాయిలో శిశుమరణాల రేటు 42 పాయింట్ల నుంచి 33పాయింట్లకు తగ్గింది.
- ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2017లో 81.8శాతం ప్రసవాలు హాస్పిటల్స్లోనే జరిగాయి. 2016లో ఇది 80.6శాతం ఉంది.