Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ క్యాడర్కు 'సంఫ్' జాతీయవాదం పాఠాలు
లక్నో : కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు తన కార్యకర్తలకు 'సంఫ్' నాయకుల చేత జాతీయవాదం పాఠాలు బోధిస్తున్నది. ఉత్తరప్రదేశ్లో ఆరెస్సెస్ నాయకులు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటుచేసి కార్యకర్తలకు బీజేపీ సిద్ధాంతాలను నూరిపోస్తున్నారు. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ మూలసూత్రాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఎంతటివారికైనా ఉధ్వాసన తప్పదని ఉద్బోధిస్తున్నారు. ఇందుకు గానూ బీజేపీ కురవృద్ధుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ కె అద్వానీని ఉదాహరణగా చూపిస్తున్నారు. 2005లో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన.. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జిన్నాను 'సెక్యూలర్' అని సంబోధించారు. దీంతో ఆయన తన పదవిని కోల్పోయారు. దీనిపై యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడు జెపి ఎస్ రాథోడ్ మాట్లాడుతూ.. 'మా పార్టీ సిద్ధాంతానికి ఎవరూ అతీతులు కాదు. దాని ఆధారంగానే పార్టీలో పదవులొస్తాయి, పోతాయి. సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అద్వానీ తన పదవి కోల్పోయారు. ఆయనొక్కరే కాదు.. అయోధ్య ఉద్యమం సమయంలో గోడ పత్రికలంటించిన కళ్యాణ్సింగ్ను సీఎం చేశాం. తదనంతర కాలంలో ఆయన సమాజ్వాదీ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వెంటనే ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. మళ్లీ బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ గవర్నర్ అయ్యారు. ఇలాంటివి అనేక ఉదంతాలున్నాయి. గుజరాత్లో ఒకప్పుడు ప్రముఖ నాయకుడిగా ఉన్న శంకర్ సిన్హా వఘేలా పరిస్థితి ఇప్పుడేమైందో అందరికీ తెలిసిందే' అని వ్యాఖ్యానించారు.