Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణిస్తున్న మూగజీవాలు
- వర్షాలు, ఉరుములే కారణమంటున్న ప్రభుత్వం
లక్నో : గోరక్షణ అంటూ గడిచిన ఐదేండ్లుగా దళిత, మైనారిటీలను కొట్టి చంపుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్న ఉత్తరప్రదేశ్లో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న గోశాలల్లో ఆవుల మరణాలు ఆగడం లేదు. గత పదిహేను రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలల్లో దాదాపు నలభై ఆవులు మృత్యువాత పడ్డాయి. గో సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్భాట ప్రచారాలు చేసుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. వాటి రక్షణను గాలికొదిలేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనెల 12న ప్రయాగ్రాజ్లో కురిసిన భారీ వర్షానికి గోశాల మొత్తం వాననీటితో నిండిపోగా.. దాని పక్కనే ఉన్న కరెంటు పోల్ విరిగిపోయి కిందపడటంతో విద్యుద్ఘాతానికి గురై 35 ఆవులు చనిపోయాయి. ఈ ఘటన మరువకముందే హర్దోరు జిల్లాలో ఆదివారం మరో నాలుగు గోవులు మరణించాయి. ఇదిలాఉంటే ప్రభుత్వం ఆవుల మరణాలను దాచిపెడుతున్నదనీ గడిచిన వారం రోజుల్లో దాదాపు పదిహేను ఆవులు మరణించాయని మన్సూర్నగర్కు చెందిన గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆవుల సంరక్షణ, గోశాలల నిర్మాణం కోసమని యోగి సర్కారు గత బడ్జెట్లో రూ. 447 కోట్లను కేటాయించింది. వీటిలో రూ. 200 కోట్లు గోశాలల కోసం కాగా మిగిలిన దానిని వాటి సంరక్షణ కోసం నిర్దేశించారు. అయితే ఒక్కో గోశాలలో పరిమితికి మించిన ఆవులను ఉంచుతుండటంతో వాటికి ఊపిరాడటం లేదు. ప్రయాగ్రాజ్, హర్దోరులలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని సీనియర్ పాత్రికేయుడు శరత్ ప్రధాన్ ఆరోపిస్తున్నారు.
200 ఆవులు పట్టే ప్రదేశంలో దాదాపు 500 వరకు ఉంచుతుండటంతో వాటికి ఊపిరాడటం లేదనీ, అంతేగాక ఆవులకు పశుగ్రాసం కొరత కూడా తీవ్రంగా ఉన్నదని ఆయన వాపోయారు. రాష్ట్రంలో ఉన్న గోశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయనీ, అందులో ఆవులకు కనీస సదుపాయాలు అందుబాటులో లేవని అన్నారు. ఆవుల పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ సర్కారు వాటిని రక్షించడాన్ని మాత్రం గాలికొదిలేసిం దని విమర్శించారు. లక్నోలో ఆరువేల ఆవులు పట్టే సామర్థ్యం మాత్రమే ఉన్న గోశాలల్లో సుమారు 20 వేల ఆవులను ఉంచారని తెలిపారు.