Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్లపై అట్టుడికిన శాసనసభ
- వాదోపవాదాలకు దిగిన అధికార, ప్రతిపక్ష సభ్యులు
అమరావతి: కాపు రిజర్వేషనపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో వాదోప వాదాలకు దిగారు. రిజర్వేషన్ల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం కాపులను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ సభ్యులు విమర్శించారు. కాపుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని టీడీపీ సభ్యులు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కూడా చర్చలో జోక్యం చేసుకుని, పరస్పర విమర్శలకు దిగడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు బడ్జెట్పై మాట్లాడుతూ కాపుల అంశాన్ని ప్రస్తావించారు. కాపుల కోసం ఐదేండ్లలో ఐదు వేల కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించిన తెలుగుదేశం ప్రభుతం కేవలం రూ.2వేల మూడు కోట్ల 61లక్షలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తుని రైలు ఘటనలో కాపులను చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందన్నారు. తనతోపాటు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డిపై కేసులు నమోదు చేశారని చెప్పారు. అంబటి ఈ వ్యాఖ్యలు చేస్తున్న ప్పుడు టీడీపీ సభ్యులు
తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా 'నీచ రాజకీయాలు చేయబట్టే మీరు అక్కడ కూర్చున్నారు' అని ఆయన విపక్ష సభ్యుల నుద్దేశించి అన్నారు. అనంతరం టీడీపీ సభ్యుడు చినరాజప్ప మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చారని, చంద్రబాబు మాత్రమే కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నించారని చెప్పారు.
మీరు మోసం చేశారు : సీిఎం
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తెలిసినా, చంద్రబాబు కాపులను మోసం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. 'కాపులను మోసం చేశారు. అందుకే మీకు సీట్లలో కోత పడింది. ఓడిపోయారు' అని అన్నారు. 'మేం ఏమి చేస్తామని అడిగేముందు మీరు ఉద్దరించిందేమిటో తెలుసుకోండి. మీరు మోసం చేశారు. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తాం. ఐదేండ్ల లో పది వేలకోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పాం, మొదటి బడ్జెట్లోనే రెండు వేల కోట్లు నిధులు కేటాయించాం' అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం బడ్టెట్లో కేటాయింపులు ఘనంగా చూపి, నామమాత్రంగా కూడా ఖర్చు చేయలేదని చెప్పారు.
మేం ఇచ్చాం..మీరేం చేస్తారు? : చంద్రబాబు
ఈబీసీలకు కేంద్రం పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తే, దానిలో 5 శాతం తాము కాపులకు ఇచ్చామని విపక్షనేత చంద్రబాబు అన్నారు. చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ 'మేం రిజర్వేషన్లు ఇచ్చాం. మీరేం చేస్తారో చెప్పండి' అని అధికారపక్షాన్ని నిలదీశారు. ఈ విషయంపై ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నించామన్నారు. ఇందుకోసం కమిషన్ వేశామని, నివేదికను ఢిల్లీకి పంపామన్నారు. 2004, 2009లో మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ల విషయాన్ని పెట్టి మోసం చేయలేదా? అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి అన్నారు.