Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సుప్రీం తీర్పు
- కర్నాటక రాజకీయం ఎటు?
న్యూఢిల్లీ: ఓవైపు సంకీర్ణ సర్కారు.. మరోవైపు బీజేపీ వేస్తున్న ఎత్తులతో కర్నాటక రాజకీయం ఎటువైపు మారనున్నది? రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తీర్పుకు ముహూర్తం ఖరారుచేసింది. తీర్పు వెల్లడిస్తే.. ఏమవుతుంది? కర్నాటక విధానసభలో నెలకొన్న సంక్షోభానికి తెరపడుతుందా..? లేక ఎలాగైనా కుమార సర్కార్ను గద్దెదింపే యత్నాలు చేస్తున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా..? గడియారం ముల్లు టిక్..టిక్..టిక్.. అంటూ తిరుగుతుంటే... కర్నాటకలో రాజకీయం హీట్ పుట్టిస్తున్నది.
సుప్రీంలో ఏం జరిగింది..?
తమ రాజీనామాలను స్పీకర్ కెఆర్ రమేశ్ కుమార్ ఆమోదించేలా ఆయనకు ఆదేశాలివ్వాలని కోరుతూ కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నది. దీంతో కర్నాటక మొదలుకుని దేశవ్యాప్తంగా ఆ రాష్ట్ర విధానసభ గురించే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పును బుధవారంనాటికి వాయిదావేస్తున్నట్టు ప్రకటించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై తీర్పునివ్వాలా, లేక వారి అనర్హత ప్రక్రియపై స్పీకరే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలా అన్నదానిని కోర్టు నిర్ధారించనున్నది. ఇన్ని రోజులపాటు స్పీకర్ ఈ లేఖలను తనవద్ద అట్టిపెట్టుకోలేరనీ, త్వరగా నిర్ణయం తీసుకోవాలని రెబల్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. కాంగ్రెస్ సభ్యుల తరఫున వాదించిన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కౌంటరిచ్చారు. రాజీనామాల ప్రక్రియ అంతా ఈ నెల 11న జరిగిందనీ, నలుగురు శాసన సభ్యులు స్పీకర్ ఎదుట ఇంకా హాజరు కాలేదని అన్నారు. నిబంధనల ప్రకారం వారి రాజీనామాలున్నాయనీ, అయినా స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని రోహత్గీ వాదించారు. ఇక రాజీనామాల విషయంలో స్పీకర్ను తాము ఆదేశించబోమని కోర్టు తొలుత స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి కుమారస్వామి తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ కూడా కోర్టులో వాదనలు వినిపించారు. కర్నాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేసి, వేరే పార్టీలో చేరి మంత్రులు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందువల్లే వారి రాజీనామాలను స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని రాజీవ్ ధవన్ న్యాయస్థానానికి తెలిపారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందువల్లే స్పీకర్ను కూడా కలవకుండా ముంబయిలో బస చేశారని గుర్తుచేశారు.
నాలుగు రోజుల నుంచి స్పీకర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించటాన్ని ధవన్ తప్పుపట్టారు. అసలు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? వ్యక్తిగతంగా రాజీనామాలను ఎందుకు ఇవ్వలేదు? స్పీకర్ నిర్ణయాక ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలందరూ గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని కోరారు. స్పీకర్ రాజ్యాంగ అధికారి. కోర్టు ఆయనపై విశ్వాసం ఉంచాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తిచేశారు. చట్టబద్ధంగా రాజీనామాలు ఉంటేనే తాను వాటిని అంగీకరిస్తాననీ స్పీకర్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును బుధవారానికి వాయిదావేసింది.
రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తున్నా : రమేశ్ కుమార్
సుప్రీం కోర్టులో జరిగిన పరిణామాల నేపథ్యంలో కర్నాటక స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాజ్యాంగానికి లోబడి తాను పనిచేస్తున్నానని అన్నారు. అంతిమంగా.. బుధవారం వెలువడే తీర్పును బట్టి తన తదుపరి చర్య ఉంటుందన్నారు. 'నేను సవాళ్లు విసిరే వ్యక్తిని కాదు.. నా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేరుస్తాను. అందరూ రేపటివరకూ వేచి వుండండి. ఒక స్పీకర్గా అన్ని విషయాలపై వ్యాఖ్యానించే స్వేచ్ఛ నాకు లేదు' అని రమేశ్ కుమార్ స్పష్టంచేశారు.
మెజార్టీ నిరూపించుకుంటా : కుమారస్వామి
అసెంబ్లీలో తాను మెజార్టీని నిరూపించుకుంటానని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ధీమా వ్యక్తంచేశారు. తన ప్రభుత్వానికి వఛ్చిన ముప్పేమీ లేదనీ, కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. కర్నాటకలో తాజా రాజీనాయ పరిణామాలు అటు అధికార పక్ష సభ్యులు, ప్రతిపక్షాలతోపాటు రెబెల్ ఎమ్మెల్యేల్లో కూడా టెన్షన్ పుట్టిస్తున్నాయి.