Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం
- మరో 24 గంటలు.. : వాతావరణశాఖ
న్యూఢిల్లీ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమవున్నాయి. అసోం, బీహార్, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అసోంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. దీంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటన ఈశాన్యవాసుల్లో దడపుట్టిస్తున్నది.
భారీ వర్షాలకు బ్రహ్మపుత్ర, ఇతర ఉపనదులు పొంగి ప్రవహిస్తుండగా, నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగి, చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు పురాతన గోడలు, ఇళ్ళు నేలమట్టం అవుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలను ముమ్మరంచేసింది. అసోంలోని మొత్తం 33 జిల్లాల్లో 30 జిల్లాలు నీటమునిగాయి. దాదాపు 52 లక్షల మంది వరద విపత్తుకు గురైనట్టు అంచనా. 20 మందికిపైగా ప్రజలు మృతిచెందినట్టు భావిస్తున్నారు.
బీహార్లో..
బీహార్లో దాదాపు 41 మంది మృతిచెందారు. ఈస్ట్ చంపారన్, పూర్నీ, దర్బాంగ్, కిషన్గంజ్ సహా 12 జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భాగమతి, కమల బలన్, లాల్బకేయా, అధ్వారా మహానంద నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సదుపాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు కొందరు నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మరి కొందరు వరద నీటిలోనే పడవలపై ప్రయాణం చేస్తున్నారు.