Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత, మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. మీసం పెంచాడని, గుర్రం ఎక్కా రని, కులాంతర వివాహం చేసుకున్నాడని ఇలా అనేక కారణాలతో దళితులపై దాడులు జరిగాయి. పశువులను తరలించారనీ, గోమాంసం పట్టుబడందనీ, జై శ్రీరామ్, జై హనుమాన్లాంటి నినాదాలను స్తుతించలేదని మైనార్టీలపై ఎన్నో ఆగ డాలు, మూకదాడులు చోటుచేసుకున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని హిందూత్వ శక్తులు పాల్పడుతున్న ఈ ఘటనలపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరి స్తున్నదన్న విమర్శలున్నాయి. దీంతో హిందూత్వ అతివాదులు మరింత రెచ్చిపోతు న్నారు. దళిత, మైనార్టీలపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగిపోతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు పార్లమెంటులో తెలిపిన గణాంకాలే సాక్ష్యం. గతేడాది లో అంతకు ముందు సంవత్సరం కంటే మైనార్టీ, దళితులపై వేధింపులు, దాడులు పెరిగిపోయాయని తెలిపింది. దేశవ్యాప్తంగా దళిత, మైనార్టీలపై దాడులు, వేధింపులకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. పార్లమెంటులో ఓ ఎంపీ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మైనార్టీలపై దాడులు, వేధింపులకు సంబంధించి 2017-18లో ఎన్హెచ్ఆర్సీకి 67 ఫిర్యాదులు అందగా.. 2018-19లో 79 ఫిర్యాదులు దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, వేధింపులకు సంబంధించి 2017-18లో 464 కేసులు ఎన్హెచ్ఆర్సీ నమోదు చేసుకోగా.. 2018-19లో ఈ కేసుల సంఖ్య 672కి చేరింది. దళితులపై దాడులు 2016-17(505 కేసులు) కంటే 2017-18(464 కేసులు)లో కాస్త తగ్గినా 2018-19(672 కేసులు)లో భారీగా పెరిగాయి. మైనార్టీలపైనా 2016-17 కంటే 2017-18లో దాడులకు సంబంధించిన కేసులు తక్కువగా నమోదైనప్పటికీ 2018-19లో మళ్లీ పెరిగాయని కేంద్ర గణాంకాలు వివరించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు మైనార్టీలపై దాడులు, వేధింపులకు సంబంధించి ఐదు కేసులు, దళితులపై దాడులకు సంబంధించి 99 కేసులు ఎన్హెచ్ఆర్సీలో నమోదయ్యాయి.
యూపీలోనే అధికం
యోగి ఆదిత్యనాథ్ పాలనలోని ఉత్తరప్రదేశ్ నుంచే దళిత, మైనార్టీలపై దాడులకు సంబంధించిన ఫిర్యాదులు ఎన్హెచ్ఆర్సీకి అధికంగా అందాయి. 2018-19లో మైనార్టీలపై వేధింపులకు సంబంధించి 19 కేసులు, దళితులపై దాడులు, వేధింపులకు సంబంధించి 311 కేసులు ఎన్హెచ్ఆర్సీ నమోదుచేసింది. 2017-18 కంటే 2018-19లో మైనార్టీలపై ఎనిమిది, దళితులపై 215 దాడులు, వేధింపుల కేసులు పెరగడం గమనార్హం. 2018-19లో మైనార్టీలపై వేధింపులకు సంబంధించి గుజరాత్ నుంచి ఎనిమిది, తమిళనాడు నుంచి ఏడు, మహారాష్ట్ర నుంచి ఐదు, హర్యానా నుంచి ఐదు ఫిర్యాదులు ఎన్హెచ్ఆర్సీకి అందాయి. కాగా, దళితులపై వేధింపులు, దాడులకు సంబంధించి రాజస్థాన్ నుంచి 41 కేసులు, హర్యానా నుంచి 33 కేసులు, గుజరాత్ నుంచి 32 కేసులు ఎన్హెచ్ఆర్సీలో నమోదయ్యాయి