Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో మళ్లీ విద్యార్థి ఎన్నికలు
- రాజకీయ పార్టీల విద్యార్థి విభాగాల అభ్యర్థులకు నో
- ఎన్ఎస్యూఐ అభ్యర్థి డిసౌజా హత్యతో 1993నుంచి బ్యాన్
ముంబయి : మహారాష్ట్రలో పూణెలోని కళాశాల క్యాంపస్లలో విద్యార్థి ఎన్నికలు చివరిసారిగా 25 ఏండ్ల క్రితం జరిగాయి. అప్పటి నుంచి మళ్లీ స్టూడెంట్ ఎలక్షన్స్ జరిగింది లేదు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలో విద్యార్థుల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. దీంతో ఈ ఏడాదిలో విద్యార్థులు మళ్లీ ఓట్లు వేయనున్నారు. మహారాష్ట్ర పబ్లిక్ యూనివర్సిటీల చట్టం 2016 కింద విద్యార్థుల ఎన్నికలు, వాటి టైం టేబుల్ రూపకల్పనపై రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ పనిచేస్తున్నది. సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశమున్నదని అంచనాలు వేస్తున్నారు. యూనివర్సిటీల నుంచి అధికారులందరూ ఈ వారంలో ముంబయిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది.
హత్యతో నిలిచిన ఎన్నికలు :
1989లో జితేంద్ర చౌహాన్ కాలేజ్ ఆఫ్ లా లో విద్యార్థుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), బీజేపీకి చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లు హౌరాహౌరు పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఆ కాలేజీలో లా మొదటి సంవత్సరం చదువుతున్న ఒవెన్ డిసౌజా ఎన్ఎస్యూఐ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో డిసౌజా హత్య జరిగింది. విద్యార్థుల ఎన్నికలు హింసాత్మకంగా మారడంతో వాటిపై సర్కారు నిషేధాన్ని విధించేందుకు సిద్ధమైంది. 1993 నుంచి రాష్ట్రంలో స్టూడెంట్ ఎలక్షన్స్పై బ్యాన్ అమల్లోకి వచ్చింది.
ఆ అభ్యర్థులకు నో చాన్స్ :
ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీల మద్దతున్న విద్యార్థి సంఘాల అభ్యర్థులను బరిలోకి దిగకుండా కోడ్ ఆఫ్ కాండక్ట్ను రూపొందించారు.
25 ఏండ్లలోపున్న విద్యార్థులు పోటీ చేసేందుకు అర్హులు. పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయ పార్టీల, మత సంస్థలకు చెందిన గుర్తులను వినియోగించకుండా నిబంధనలు రూపొందినట్టు సమాచారం. ఎన్నికల ప్రక్రియ పద్ధతులపై గతవారం సావిత్రిబాయి ఫూలె పూణె యూనివర్సిటీ(ఎస్పీపీయూ)లో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఎన్నికల షెడ్యూల్కు సంబంధించీ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఒకే రోజు ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ భావిస్తున్నదని ఎస్పీపీయూ ప్రొ వైస్ చాన్సిలర్ ఎన్ఎస్ ఉమ్రాని తెలిపారు.