Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడిటింగ్ సంస్థ పీడబ్ల్యూసీ నివేదికతో..
కార్పొరేట్ మంత్రిత్వశాఖ దర్యాప్తు
- నిధుల దారి మళ్లింపు, అనుమానాస్పద లావాదేవీలపై...
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హౌం ఫైనాన్స్పై వచ్చిన ఆర్థిక మోసాల ఆరోపణలపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వశాఖ(ఎంసీఏ) దర్యాప్తు ప్రారంభించింది. నిధుల దారి మళ్లింపు, అనుమానాస్పద లావాదేవీలపై ఈ దర్యాప్తు జరగనున్నది. ఈ రెండు కంపెనీల ఆడిటర్ బాధ్యతల నుంచి ప్రైస్ వాటర్హౌజ్(పీడబ్ల్యూసీ) ఉపసంహరిం చుకున్న తర్వాత ఈ దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం. 2018-19 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీలు జరిపిన ఆర్థిక లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ ఏడాది మే నెలలో ఆడిటింగ్ బాధ్యతల నుంచి పీడబ్ల్యూసీ వైదొలిగింది. ప్రశ్నించదగిన లావాదేవీలకు సంబంధించి కొన్ని పత్రాలను కూడా మంత్రిత్వశాఖకు పీడబ్ల్యూసీ సమర్పించింది.
రిలయన్స్కు చెందిన రెండు కంపెనీల యాజమాన్యంతోపాటు ఆడిట్ కమిటీలను ఎంసీఏ ప్రశ్నించనున్నది. దర్యాప్తు అధికారులు ప్రస్తుత ఆడిటింగ్ కంపెనీలైన పాథక్ హెచ్డీ అండ్ అసోసియేట్స్తోపాటు గతంలో ఆడిటింగ్ నిర్వహించిన పీడబ్ల్యూసీ అధికారుల్ని కూడా ప్రశ్నించనున్నారు. మరికొన్ని వారాల్లో తీవ్ర మోసాల దర్యాప్తు కార్యాలయం కూడా రంగంలోకి దిగనున్నట్టు చెబుతున్నారు. అయితే, తామేమీ నిధులు మళ్లించలేద, పీడబ్ల్యూసీ చేస్తున్న ఆరోపణలన్నీ ఆధారంలేనివని అనిల్కు చెందిన రెండు కంపెనీలు కొట్టివేస్తున్నాయి.
కొంతకాలంగా అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీలు పలు వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇటీవలే ఆర్కామ్, రిలయన్స్ టెలీకాం, రిలయన్స్ టెలీకాం ఇన్ఫ్రాస్ట్రక్షర్ల రూ.5500 కోట్ల లావాదేవీలపై దర్యాప్తును ఎస్బీఐ ప్రారంభించింది. 2017 మే నుంచి 2018 మార్చి వరకు ఈ మూడు కంపెనీలు జరిపిన పలు అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తునకు ప్రముఖ అకౌంటింగ్ సంస్థ బీడీవోను ఎస్బీఐ రంగంలోకి దించింది. ఏమంత పేరులేని కంపెనీయైన నెటిజెన్కు 2017 మే నెలలో మూలధన ఖర్చుల అడ్వాన్స్ కింద రూ.4000 కోట్లు అనిల్ కంపెనీల నుంచి వెళ్లడంలాంటివి అనుమానాలు రేకెత్తించాయని ఎకనామిక్ టైమ్స్ పేర్కొన్నది.
అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీలు రూ.లక్ష కోట్లమేర అప్పుల ఉబీలోకి చిక్కుకున్నాయి. వీటిలో ఆర్కామ్ అప్పుల మొత్తం రూ.49,193 కోట్లు కాగా, రిలయన్స్ టెలికాం అప్పులు రూ.24,306 కోట్లు. ఆర్కామ్పై ఇప్పటికే దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది ప్రారంభంలో అనిల్ కంపెనీలకు అప్పులిచ్చిన 90 శాతం రుణదాత సంస్థలు యథాతథస్థితి ఒప్పందం చేసుకున్నాయి. దీనికి 2019 సెప్టెంబర్ వరకు గడువు విధించాయి. తన రుణదాతలకు 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మే 31 వరకు 14 నెలల్లో రూ.35,000 కోట్లు చెల్లించినట్టు అనిల్ ఇటీవల ప్రకటించారు. ఇందులో అసలు రూ.24,800 కోట్లు కాగా, వడ్డీ రూ.10,600 కోట్లు అన్నది గమనార్హం.