Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు 6,153 ఇండ్లను నిర్మించిన రాష్ట్ర సర్కారు
తిరువనంతపురం : గతేడాది ఆగస్టులో భారీ వర్షాలు, తీవ్ర వరదలతో కొట్టుకుపోయిన కేరళ తిరిగి నిలదొక్కుకుంటున్నది. రాష్ట్ర పునర్నిర్మాణంలో ముందుకెళ్తున్నది. కేంద్రంలో మోడీ సర్కారు నుంచి ఆశించినస్థాయిలో ఆర్థికం సాయం అందకపోయినా.. ప్రతిపక్షపార్టీలు విమర్శ లతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. విజయన్ సర్కారు మాత్రం 'కేరళ పునర్నిర్మాణం' కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. అక్కడి ప్రజలు, వివిధ రంగాలకు చెందిన సంస్థల సహాయంతో సహాయ కార్యక్రమాలను విజయ వంతంగా ముందుకు తీసుకెళ్తున్నది. రాష్ట్రంలో తీవ్ర వరదలతో పూర్తిగా ధ్వంసమైన ఇండ్ల స్థానంలో రాష్ట్ర సర్కారు ఇప్పటి వరకు రూ. 307.82 కోట్లతో 6,153 ఇండ్లను నిర్మించింది. అంతేకాకుండా పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లను పునర్నిర్మించడం కోసం దాదాపు రూ. 1,339.89 కోట్లను ఖర్చు చేసింది. ఇది రాష్ట్రంలో పరోక్షంగా 2,51,500 కుటుంబాలకు ప్రయోజనాన్ని చేకూర్చింది. అతివృష్టి సమయంలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో దాదాపు 15,463 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వీటిలో ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో 9,329 ఇండ్లను సంబం ధిత కుటుంబాలు నిర్మించుకోగలిగాయి. పునర్నిర్మాణ కార్యక్రమాలు రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నాయి. కేర్ హౌం ప్రాజెక్టు కింద మొదటి దశలో భాగంగా కో- ఆపరేషన్ డిపార్ట్మెంట్ రెండువేల ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే 1500 ఇండ్ల నిర్మాణం పూర్తవగా రాష్ట్ర సర్కారు వాటిని లబ్దిదారులకు అందజేసింది. అలాగే పట్టణ వ్యవహారాల విభాగం సహాయంతో రెండో దశలో రూ. 20.14 కోట్లతో రెండువేల ఫ్లాట్ల నిర్మాణాన్ని కేరళ సర్కారు చేపట్టనున్నది. కేరళకు దాదాపు రూ. 1717 కోట్ల ఆర్థిక సహాయం చేయడానికి ఇటీవల ప్రపంచబ్యాంకు సైతం ముందుకొచ్చిన విషయం తెలిసిందే.