Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియను పున్ణపరిశీలన పేరుతో మరింత జాప్యం చేయాలని కేంద్రంలోను, అసోంలోని బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ(ఎం) పేర్కొంది. పార్టీ పొలిట్బ్యూరో గురువారం ఈ మేరకు ఇక్కడ ఒక ప్రకటన విడుదలజేసింది. ముసాయిదా ఎన్ఆర్సీలో శాంపిల్ రీ వెరిఫికేషన్ (నమూనా పున్ణ పరిశీలన) కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభ్యర్థన లక్షలాది మంది పౌరులను మరింతగా వేధించేందుకు దారితీస్తుందని సీపీఐ(ఎం) పేర్కొంది. పదే పదే విచారణలు, పత్రాల సమర్పణ వంటి చర్యల వల్ల లక్షలాది మంది పౌరులు తమ వనరులను, సమయాన్ని ఇప్పటికే చాలావరకు కోల్పోయారని పొలిట్బ్యూరో పేర్కొంది. ఎన్ఆర్సీ తుది జాబితా ప్రచురణకు గడువు జులై 31 దగ్గర పడుతుండడంతో హఠాత్తుగా ఈ డిమాండ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తేవడంలో బీజేపీ ఎజెండా ఏమిటో అర్థమవుతుందని పొలిట్బ్యూరో విమర్శించింది. మతం ఆధారంగా పౌరసత్వ గుర్తింపు ఇవ్వాలని బీజేపీ కోరుకుంటోంది. ఎన్ఆర్సీ జాబితాతో ముడిపడి వున్న ఈ అంశాల వెనక రకరకాల ఉద్దేశాలు ఉన్నందున న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ జాబితా నుంచి అక్రమంగా మినహాయించిన వారికి న్యాయం చేయాలని, ముసాయిదా ఎన్ఆర్సీ నుంచి తొలగించిన లక్షలాది మంది పౌరుల పరిస్థితి ఏమిటి? అని సీపీఐ(ఎం) ప్రశ్నించింది. ఎన్ఆర్సీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టే పౌరుల ప్రాథమిక హక్కులు, భారతీయ పౌరసత్వానికి సంబంధించిన మౌలిక అంశాలను పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని పొలిట్బ్యూరో కోరింది.